ఉత్తరాంధ్ర సీనియర్ రాజకీయ నేత కొణతాల రామకృష్ణ రాజకీయ అడుగులు తడబడుతున్నాయి. వైసీపీలో చేరేందుకు.. లోటస్పాండ్కు వెళ్లి మరీ వెనక్కి వచ్చేసిన కొణతాల… మళ్లీ చంద్రబాబును కలిశారు. ఆయన ఏ పార్టీలో చేరాలన్నదానిపై ఇంత వరకూ.. ఏ నిర్ణయానికి రాలేకపోయారు. గత ఎన్నికల్లో వైసీపీ తరపున పని చేశారు. అనకాపల్లి నుంచి తన సోదరుడ్ని బరిలోకి దింపారు. ఆయన ఓడిపోయారు. విశాఖలో పోటీ చేసిన విజయమ్మ బాధ్యత తీసుకుని ఫెయిలయ్యారు. దాంతో జగన్తో దూరం పెరిగింది. ఆ తర్వాత అవమానాలు తట్టుకోలేక.. లేఖలు సంధించారు. ఈ కారణంగా.. జగన్ సస్పెన్షన్ వేటు వేశారు. ఆ తర్వాత ఉత్తరాంధ్ర చర్చా వేదిక పెట్టి… రాజకీయాల్లో వెనుకబడకుండా ప్రయత్నాలు చేశారు. చివరికి ఆయన టీడీపీకి దగ్గరయ్యారు.
రెండు, మూడు సార్లు టీడీపీ అధినేతతో గతంలో సమావేశం అయ్యారు. పార్టీలో చేరేందుకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు కానీ… టిక్కెట్ విషయంపై క్లారిటీ ఇవ్వలేదు. ముందుగా పార్టీలో చేరమని సూచించారు. కానీ.. కొణతాలకు గ్యారంటీ లేకపోవడంతో.. వెనక్కి తగ్గారు. ఈ లోపు… అనకాపల్లి లోక్ సభ నుంచి… టీడీపీ తరపున అడాలి ఆనంద్ అనే నేతను ఖరారు చేసినట్లు పత్రికల్లో రావడంతో.. తనకు అవకాశం రాదనుకుని వైసీపీ వైపు చూశారు. కానీ అక్కడా కండువా కప్పించుకోలేకపోయారు. తన సస్పెన్షన్ ఎత్తి వేయాలని జగన్ ను అడిగితే.. తర్వాత చుద్దామన్నారని.. ప్రచారం జరుగుతోంది. ఈ కారణంగానే… కొణతాల నొచ్చుకున్నారంటున్నారు.
చంద్రబాబు… కొన్ని అసెంబ్లీ, పార్లమెంట్ సీట్లకు అభ్యర్థులను ప్రకటించనప్పటికీ.. దాదాపుగా కసరత్తు అయితే పూర్తి చేశారు. అభ్యర్థులను ఖరారు చేశారు. సర్ది చెప్పాల్సిన నేతలు, సమీకరణాలు చూసుకుంటున్నారు. ఈ క్రమంలో… కొణతాల మళ్లీ టీడీపీ అధినేతను కలిశారు. ఆయనకు చంద్రబాబు చాన్సిస్తారా లేదా.. అన్నది ఆసక్తికరంగా మారింది. కొణతాల రాజకీయ పయనం.. చూస్తున్న వారు.. ఆయన ఎందుకు ఇంత గందరగోళంగా ఉన్నారన్న అంశంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.