ఇటీవల ప్రత్యేక హోదా వివాదం తర్వాత చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మనకు లభించిన అతి గొప్ప ప్రయోజనం పోలవరం అని ప్రచారం చేసుకుంటున్నది. ముఖ్యమంత్రి అక్కడ పర్యటించి వచ్చారు. పోలవరంకు సంబంధించి కేంద్రం కొత్తగా చేసిన నిర్ణయమేమీ లేదు. జాతీయ ప్రాజెక్టు కింద పూర్తి బాధ్యత తీసుకోవడానికి తటపటాయించిన వారు ఇప్పుడు ఒప్పుకున్నామంటున్నారు.
అయితే అయిదేళ్లలోనూ సగం కాలానికి ఇచ్చింది 850 కోట్లు మాత్రమే గనక మిగిలిన కాలంలోనూ వారి మాట ఎంతగా అమలు అయ్యేది అనుమానమే.ఇస్తామన్నది కూడా రాష్ట్ర ప్రభుత్వం అప్పు చేస్తే కట్టేస్తామని మాత్రమే. ఆ అప్పు కూడా ఎఫ్ఆర్ఎంబి పరిమితికి లోబడి వుండాలని షరతు. కనకు ఎవరు ఇస్తారు ఎప్పుడు వస్తుంది.. దాన్ని ఏ మేరకు ఆమోదిస్తారు , ఎప్పుడు తిరిగి చెల్లిస్తారనే సందేహాలు మిగిలే వుంటాయి.ఇప్పటికి ఇచ్చిన 850 కోట్లు గాక రాష్ట్ర ప్రభుత్వం ఇంకా రెట్టింపు ఖర్చు చేసింది. ఆ సొమ్ము మంజూరు చేయడానికి ఆలస్యం దేనికి?
రాష్ట్ర ప్రభుత్వానికే నిర్మాణ బాధ్యత అప్పగించడం ు దానివల్ల జరిగే పనిలో కేంద్రం బాధ్యత తగ్గిపోతుంది. ఏది అడిగినా రాష్ట్రం నుంచి రావాలనే సమాధానమే మిగులుతుంది. డిపిఆర్లు రాలేదనే సాకుతో జాప్యం జరుగుతుంది. గతంలో జరిగిన దానిపైనే అన్ని శంకలు లేవనెత్తిన ఢిల్లీ పెద్దలు ఇకముందు ఒక్కసారిగా ఎందుకు మారిపోతారు? కేంద్రం ఖర్చు భరిస్తూ జవాబుదారి తనం తీసుకోకపోతే పార్లమెంటు ఎందుకు ఒప్పుకుంటుంది? రెండు ప్రభుత్వాల మధ్య ప్రాజెక్టు పనులూ నిధులు వివాదంగా మారిపోతే ఏమవుతుంది?
ప్యాకేజీ అంటూ ఏదో ప్రకటన చేసిన మరుసటి రోజునే నిర్మాణం చేస్తున్న ట్రాన్స్ట్రారు సంస్థకు 14 వందల కోట్ల మేరకు అంచనా వ్యయం పెంచితే అనుమానాలు కలగవా? చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో వుంటే అడిగే వారు కాదా?పోలవరంలో భాగమైన విద్యుత్ ప్లాంట్ను ప్రైవేట్ సంస్థకు అప్పగించడం ఆందోళనకరమైన నిర్ణయం. ప్రాజెక్టు అంతర్భాగంలోని ఇక విద్యుద్కేంద్రాన్ని ఇలా ప్రైవేటుకు ఇవ్వడం ఎప్పుడూ జరిగింది లేదు.
30 ఏళ్లలో కానిది రెండేళ్లలోనే హడావుడి చేస్తున్నారని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు పదే పదే ఆరోపిస్తున్నారు. 1980లలో శంకుస్థాపన జరిగినా నిజంగా ప్రారంభమైంది 2005లో వైఎస్ రాజశేఖరరెడ్డి పాలనా కాలంలోనేనని ఆయనకూ తెలుసు. 1994లో ఎన్నికలకు ముందు అప్పటి ప్రధాని పివి నరసింహారావు విజయవాడకు వచ్చినప్పుడు విలేకరులు మొదటగా పోలవరం గురించి అడిగితే అది సమస్యాత్మకమని సూటిగా అంగీకరించారు. తర్వాత వివిధ కారణాల వల్ల వైఎస్ దాన్ని మరింత పెద్దది చేసి ప్రారంభించారు. ఆ క్రమంలో తెలంగాణ ప్రాంతంలో అభ్యంతరాలతో సహా అనేక ఆరోపణలూ వచ్చాయి.ఇప్పడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలవరంపై ప్రత్యేక ప్రచార కాండ చేపట్టడంలో ఉద్దేశం హౌదా ఉద్యమంపై నుంచి దృష్టి మరల్చడమే. పట్టిసీమకు పదిసార్లు ప్రారంభోత్సవాలు చేసినట్టు పోలవరంను కూడా చేయాలనుకుంటున్నారన్నది నిజం. అసలు డ్యాం సంగతి వదిలేసి కాఫర్ డాం అనే మట్టికట్ట గురించి ముఖ్యమంత్రి అంత వివరంగా మాట్లాడ్డం జరుగుతున్నది. మట్టికట్ట ఉద్దేశం నీటి ప్రవాహాన్ని మళ్లించడమే తప్ప అడ్డుకోవడానికి సరిపోదు.సాంకేతికావసరాల కోసం నిర్మించే కాఫర్ డాంనే ఆనకట్టగా చూపించడం గతంలో జరిగింది లేదు. వెయ్యేళ్లు వుండాల్సిన ప్రాజెక్టు విషయంలోనూ ఇలా హడావుడి పడటం వాంఛనీయం కాదు.
పోలవరం లైఫ్లైన్ అని అదేపనిగా చెప్పడం నీటివనరులు లేని రాయలసీమపై చూసే రాజకీయ ప్రభావం గురించి కాస్తయినా బాధ్యతగా ఆలోచించడం లేదు. ఇక్కడ మిగులు జలాలు కృష్ణాలోకి మళ్లిస్తామని చెప్పే మాటల విశ్వసనీయత ప్రశ్నార్థకంగా వుంది. ఈ సమస్యలన్నిటితో పాటు అసలు నిధుల కొరతే పెద్ద గుదిబండగా మారనుంది.ఏతావాతా జరుగుతున్నది పోలవరం డైవర్షన్ స్కీం మాత్రమే. ప్రతిమూడో సోమవారం దీనిపై పర్యవేక్షణ చేస్తానని ముఖ్యమంత్రి ప్రకటించారు గనక నెలకోసారి ప్రత్యేక ఈ ప్రహసనం చూడాల్సి రావచ్చు. కాకపోతే ఎలాగూ ఇవ్వాల్సిన పోలవరం ఇచ్చారని సంబరపడిపోయి మిగిలినవి హౌదా ప్యాకేజీలు వదిలేసుకున్నందుకు చాలా మూల్యం చెల్లించాలి.