ఆంధ్రప్రదేశ్లో ఇక విధుల్లో చేరకూడదని.. ఎల్వీ సుబ్రహ్మణ్యం నిర్ణయించుకున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఆయన పేరుతో సోషల్ మీడియాలో ఓ లేఖ హల్ చల్ చేస్తోంది. దాని మీద ఎలాంటి సంతకాలు లేకపోయినప్పటికీ.. అది ఆయన తోటి ఐఏఎస్లకు వాట్సాప్ ద్వారా పంపినట్లుగా భావిస్తున్నారు. అందులో ఆయన అభ్యంతరకపదాలు ఏమీ వాడలేదు. ఎవరి మీద ఆరోపణలు చేయలేదు. అయ్యా నమస్కారం అంటూ ప్రారంభించారు. కొత్త సీఎస్గా నీలం సహాని బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన క్యాంప్ ఆఫీసుకు వచ్చారు. ఎల్వీతో మర్యాద పూర్వక భేటీ కోసం అని చెప్పినప్పటికీ.. ఆమె .. క్యాంప్ కార్యాలయం, ఇల్లు చూడటానికి వచ్చారు. రెండు రోజుల్లో ఎల్వీ వాటిని ఖాళీ చేసేలా.. ఒత్తిడి చేసే వ్యూహం ఇందులో ఉందంటున్నారు. దీంతో ఎల్వీ లేఖ వైరల్ అయిపోయింది.
ఏపీ ప్రధాన కార్యదర్శిగా పనిచేసినందుకు సంతోషంగా ఉంది.. సీఎస్గా నా విధి నిర్వహణలో విభిన్న అనుభవాలు ఎదుర్కొన్నానని ఎల్వీ ఆ చిన్న లేఖలో పేర్కొన్నారు. నా సర్వీసుకు, కేడర్కు, నా పోస్టుకు తగని పని నేను చేశాననుకోవడం లేదని స్పష్టం చేశారు. నా మీద విభిన్న వ్యాఖ్యలు చేసినా, ఎవరికి తోచిన తీర్పులు వాళ్లు ఇచ్చినా ఐఏఎస్ ప్రవర్తనా నియమావళికి కట్టుబడి మౌనం వహించానన్నారు. నన్ను సమర్థించి ప్రోత్సహించినవారందరికీ ధన్యవాదాలు చెప్పుకున్నారు. సరైన వీడ్కోలు లభించలేదని కూడా నేనేమీ బాధపడటం లేదని చెప్పుకొచ్చారు.
ఎల్వీని బాపట్లలో విధులు, నిధులు ఉండని శిక్షణా సంస్థకు డైరక్టర్ జనరల్గా నియమించారు. అది తనకు మరింత అవమానంగా ఆయన భావించారు. కేంద్ర సర్వీసుకు వెళ్లేందుకు.. తన పరిచయాల ద్వారా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే నెల రోజులు సెలవు పెట్టారు. ఒక వేళ కేంద్ర సర్వీసుకు వెళ్లే అవకాశం రాకపోయినా.. ఆయన మాత్రం.. ఇక ఏపీలో విధుల్లో చేరకూడదని భావిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.