మంచు మనోజ్ సెకండ్ ఇన్నింగ్స్ ఈమధ్యే మొదలు పెట్టాడు. తను నటించిన ‘భైరవం’ త్వరలోనే విడుదల కానుంది. ‘మిరాయ్’లో విలన్గా కనిపించబోతున్నాడు. ఇవి కాకుండా హీరోగా ఓ రెండు సినిమాలు మొదలెట్టాడు. కానీ అవి మధ్యలోనే ఆగిపోయాయి. ఇప్పుడు మరో కొత్త సినిమా శ్రీకారం చుట్టడానికి రెడీ అయ్యాడు. 90 ఎం.ఎల్ ఫేమ్ శేఖర్ రెడ్డి దర్శకుడు. ఈ చిత్రానికి ‘అత్తరు సాయిబు’ అనే టైటిల్ ఖరారు చేసినట్టు సమాచారం. టైటిల్ వినగానే ఇది ఏ తరహా సినిమానో అర్థం చేసుకోవొచ్చు. ఫుల్ లెంగ్త్ ఎంటర్టైన్మెంట్ తో సాగే కథ ఇది. కొద్ది రోజులుగా కథా చర్చలు నడుస్తున్నాయి. అవి ఇప్పుడు ఓ కొలిక్కి వచ్చాయి. ఈనెల 20న ఈ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. నిర్మాత, ఇతర నటీనటుల వివరాలు త్వరలో వెల్లడవుతాయి.
‘వాట్ ద ఫిష్’, ‘అహం బ్రహ్మస్మి’ సినిమాలు మంచు మనోజ్ ఇది వరకే మొదలెట్టాడు. అయితే ఇవి ఎంత వరకూ వచ్చాయో తెలీలేదు. వీటికి సంబంధించిన అప్ డేట్ కూడా ఇప్పటి వరకూ బయటకు రాలేదు. ‘భైరవం’ షూటింగ్ పూర్తయ్యింది. ఈ సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్ కూడా నటించారు. ఓరకంగా ఇది ఓ మినీ మల్టీస్టారర్. ‘కన్నప్ప’కు పోటీగా ఈ సినిమాను విడుదల చేయాలన్నది మనోజ్ ప్లాన్. ఇది వరకు ‘కన్నప్ప’ రిలీజ్ డేట్ ప్రకటించిన వెంటనే అదే రోజున ‘భైరవం’ విడుదల చేస్తున్నట్టు చిత్రబృందం ప్రకటించింది. కానీ ‘కన్నప్ప’ వాయిదా పడడంతో ‘భైరవం’ చిత్రాన్నీ వాయిదా వేశారు.