కోర్టు జోక్యం చేసుకుంటే తప్ప తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యపరిస్ధితిపై అధికారికంగా వివరాలు వెల్లడించలేని పరిస్ధితి పత్రికలు, టివిల వంటి సమాచార సాధనాల డొల్లతనాన్ని బయటపెడుతోంది. టెక్నాలజీలు పెరిగి మీడియా విస్తరించినా, వేగం పెరిగినా క్వాలిటీ వేగంగా పతనమైపోతూందనడానికి ఇది ఒక తాజా ఉదాహరణ మాత్రమే! రకరకాల ‘సోర్సెస్’ తో నిరంతర సంబంధాలు కలిగివుండి, సేకరించుకున్న సమాచారాన్ని ధృవీకరించుకుని ప్రచురించే లేదా ప్రసారం చేసే జర్నలిస్టుల నైపుణ్య సామర్ధ్యాలు ఊదరగొట్టే ప్రచార శక్తులుగా మారిపోవడం విచారకరం.
మిడియా యాజమాన్యాలు రాజకీయ ఆసక్తులతో కల్తీ అయిపోయాక, రాజకీయ అధికారం కోసమో, రాజకీయ ప్రత్యర్ధులను అడ్డుకోవడం కోసమో మీడియాలు పుట్టుకు రావడం మొదలయ్యాక జర్నలిజం స్ధాయి ”వృత్తి” నుంచి ”ఉద్యోగం” గా మారిపోయింది. ఎవరు ఏమి చెప్పినా టివిలో చూపించే ”డ్యూటీ”గా మారిపోయింది. దీన్ని పెద్దనోరున్న వారు గట్టిగానే వాడుకోగల పరిస్ధితి నెలకొంది.
జయలలిత ఆరోగ్యస్ధితి పై ప్రజల్లో తీవ్రమైన పుకార్లు వ్యాపించాయంటే అందుకు ప్రధాన కారణం ఆమె రాజకీయ ప్రత్యర్ధి కరుణానిధి ”ఆమెకు ఏమైంది…హెల్త్ బులిటెన్లు ఎందుకు జారీ కావడంలేదు” అని ‘గట్టిగా’ ప్రశ్నించడమే!
జయలలిత అనారోగ్యాన్ని గోప్యంగా వుంచడానికి ప్రభుత్వానికి రాజకీయ కారణాలు వుండి వుండవచ్చు. సమాచారాన్ని సేకరించకుండా వుండటానికి జర్నలిస్టులకు ఏ కారణం వుంటుంది. చెన్నైలో వున్న ఎందరెందరో సీనియర్ జర్నలిస్టులకు ప్రభుత్వ వర్గాలతో, కనీసం అపోలో ఆస్పత్రి వర్గాలతో కనీస సంబంధాలు కూడా లేవా? వివరాలు చెప్పిన వారి పేరు బయటపెట్టకుండానే పాఠకులకు సమాచారం ఇచ్చే నైపుణ్యం సీనియర్లకు కూడా లేకుండా పోయిందా? ఈ దురవస్ధ చెన్నై కి మాత్రమే పరిమితంకాదు. దేశమంతా ఇదే దుస్ధితి!
జర్నలిస్టులు ఎవరో చెప్పిన విషయాలను సొంత కథనం అన్నట్టు యధాతధంగా తెర ఎక్కించే “లీకు” వీరులుగా మారిపోవడం వల్ల నిజానిజాలు తెలుసుకోడానికి కోర్టులను ఆశ్రయించడం మినహా పౌర సమాజానికి మరో దారి లేకుండాపోయింది…జయలలిత ఆరోగ్య పరిస్ధితులపై వార్తలు ఇవ్వడంలో మీడియా ”కొరియర్ బాయ్” పాత్రకే పరిమితమైపోవడంతో నిజానిజాలు తెలుసుకోడానికి ఒక న్యాయవాది కోర్టుకి వెళ్ళారు…ఆయన అభ్యర్ధన ప్రకారం తమిళనాడు ముఖ్యమంత్రి అనారోగ్యం వివరాలు, స్ధితిగతులపై బులిటెన్లు జారీచేయాలని హైకోర్టు ఆదేశించింది.