ఇది వరకు సినిమా అంటే ఎన్ని రోజులు ఆడింది? అనేదే లెక్క. అవే రికార్డులు. వంద రోజులు ఎన్ని ఎక్కువ కేంద్రాల్లో ఆడితే అంత గొప్ప. ఆ తరవాత వంద రోజులు పోయి … వారాలకు పడిపోయింది తెలుగు సినిమా. దాంతో రికార్డు లెక్కలూ మారిపోయాయి. ఎంత వసూలు చేసింది? అనే అంకెలనే చూస్తున్నారు. నైజాంలో మాది ఫస్టు, ఓవర్సీస్ లో మేమే నెంబర్ వన్ అంటూ వర్గీకరణలు కూడా మొదలైపోయాయి. ఇప్పుడు టీఆర్పీ రేటింగులపైనా పడ్డారు. సినిమా అన్నాక.. దానికి శాటిలైట్ మార్కెట్ ఉంటుంది.. శాటిలైట్ హక్కులు అన్నేసి డబ్బులు పోసి కొన్నాక టీవీల్లో తప్పకుండా వస్తుంది. స్టార్ హీరో సినిమా టీవీలో అంటే.. ఎలాగూ థియేటర్లకు వెళ్లని ఫ్యామిలీ ఆడియన్స్కి పండగే. దాంతో టీఆర్పీ రేటింగుల హంగామా మొదలైంది. మా హీరో సినిమాకి టీఆర్పీ బాగుందంటే, మాది బాగుందంటూ ఫ్యాన్స్ కూడా టీఆర్పీలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇది వరకు మగధీర టీఆర్పీ బాగుండేది. ఆ తరవాత అత్తారింటికి దారేది ఆ రికార్డుని బ్రేక్ చేసింది. ఇప్పుడు బాహుబలి.. అందర్నీ దాటుకొని వెళ్లిపోయింది.
మాటీవీలో ప్రదర్శితమైన బాహుబలి ఎవ్వరికీ అందనంత స్థాయిలో రేటింగులు అందుకొంది. ఇప్పుడు ఈ రికార్డుని ఎవరు బద్దలు కొడతారా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారంతా. దానిపై కన్నేసింది జనతా గ్యారేజ్ . ఈ సినిమాని దాదాపు రూ.12 కోట్లకు మాటీవీ దక్కించుకొంది. ఎన్టీఆర్ సినిమాల్లో ఇదే హైయ్యస్ట్ పెయిడ్. ఈ మొత్తాన్ని వీలైనంత త్వరగా రాబట్టుకోవాలని చూస్తోంది మాటీవీ. దాంతో పాటు జనతా గ్యారేజ్కీ… బాహుబలి రికార్డుల్ని బ్రేక్ చేయాలని ఉంది. అందుకే… జనతా విడుదలైన 53 రోజులకే టీవీలో వేసేస్తున్నారు. అక్టోబరు 23న ఆదివారం మాటీవీలో ఈ సినిమాని ప్రదర్శిస్తారు. ఆదివారం.. పైగా జనతా ఫీవర్ ఇంకా ఉంటుండగానే ఈ సినిమా టీవీలో వస్తే టీఆర్పీ రేటింగులు అదిరిపోవడం ఖాయం. అందుకే… చిత్రబృందం ఈ నిర్ణయం తీసుకొంది. మరి జనతా ప్లాన్ వర్కవుట్ అవుతుందా? బాహుబలి రికార్డులు ఉంటాయా?? లేదా?? తెలియాలంటే అక్టోబరు 23 వరకూ ఆగాలి.