రాజకీయ కుట్రల్లో భాగమై మహిళా ఐఏఎస్లపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసిన ఎన్టీవీపై ఐఏఎస్ల సంఘం తీవ్ర ఆగ్రహం వ్య్కతంచేస్తోంది. ఎన్టీవీ యాజమాన్యం , నరేంద్ర చౌదరి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ ఒక ఘాటైన లేఖను ఐఏఎస్ అధికారుల సంఘం విడుదల చేసింది.
తెలంగాణకు చెందిన ఒక మహిళా ఐఏఎస్ అధికారి వ్యక్తిగత జీవితాన్ని కించపరిచేలా, సదరు అధికారిణికి, ఒక మంత్రికి మధ్య వివాహేతర బంధం నడుస్తోందంటూ ఎన్టీవీ కథనం ప్రసారం చేసింది. ఈ కథనం క్లిప్పింగులతో బీఆర్ఎస్ సోషల్ మీడియా ఆ అధికారి ఎవరో తెలిసిపోయేలా ఘోరమైన ప్రచారాలు చేసింది. ఇది మహిళా అధికారి వ్యక్తిత్వంపైనే దాడి కావడంతో ఐఏఎస్ అధికారుల సంఘం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. రాజకీయ కారణాలతో లేదా టీఆర్పీ రేటింగ్ల కోసం ఒక బాధ్యతాయుతమైన అధికారి పరువుకు భంగం కలిగించడం క్షమించరాని నేరమని సంఘం పేర్కొంది.
సదరు మహిళా అధికారికి మంత్రి ప్రత్యేక పోస్టింగ్లు ఇప్పించారనే ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని, ఇవి కేవలం పరిపాలనాపరమైన బదిలీలను రాజకీయం చేసే ప్రయత్నమని లేఖలో స్పష్టం చేశారు. మీడియాకు ఉన్న స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తూ, అధికారుల వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీయడం నైతికత లేని జర్నలిజానికి నిదర్శనమని సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి నిరాధారమైన వార్తలు సివిల్ సర్వీస్ అధికారుల మనోధైర్యాన్ని దెబ్బతీయడమే కాకుండా, సమాజంలో వారి పట్ల ఉన్న గౌరవాన్ని తగ్గిస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం ఊహాగానాలతో కూడిన కథనాలు ప్రసారం చేయడం వల్ల కుటుంబ వ్యవస్థలపై కూడా తీవ్ర ప్రభావం పడుతుందని ఐఏఎస్ అధికారుల సంఘం పేర్కొంది.
వెంటనే సదరు తప్పుడు కథనాన్ని అన్ని ప్లాట్ఫారమ్ల నుండి తొలగించాలని మ, ఎన్టీవీ అధినేత నరేంద్ర చౌదరి ఈ విషయంలో బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని ఐఏఎస్ సంఘం డిమాండ్ చేసింది. ఒకవేళ స్పందించని పక్షంలో న్యాయపరమైన చర్యలు తీసుకోవడానికి కూడా వెనుకాడబోమని హెచ్చరించింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, సమాచార శాఖకు కూడా ఫిర్యాదు చేశారు. 
