ఈవారం విడుదల అవుతున్న మిరాయ్, కిష్కిందపురి చిత్రాలకు ఓ కామన్ ఫ్యాక్టర్ వుంది. ఈ కథలు రెండూ విభిన్నమైన జోనర్లు. పైగా వీఎఫ్ఎక్స్ ది కీలకమైన పాత్ర. కిష్కిందపురిలో కొన్ని సీన్లు వీఎఫ్ఎక్స్ తో ముడిపడ్డాయి. మిరాయ్ లో అయితే దాదాపు 40 శాతం వర్క్ సీజీలతోనే నడిచింది. ఈ రెండు సినిమాల విజయాల్ని డిసైడ్ చేసేది ఈ సీజీ వర్కులే.
ఈరోజుల్లో సీజీ వర్క్లు ఎలా పడితే అలా చేయడం కుదరదు. క్వాలిటీ మేకింగ్ చాలా అవసరం. సీజీల్లో ఏమాత్రం తేడా వచ్చినా, అది సినిమాపై విపరీతమైన ప్రభావం చూపిస్తోంది. సినిమాలోని ఎమోషన్తో డిస్కనెక్ట్ అయిపోయే ప్రమాదం పేలవమైన సీజీలు తెచ్చిపెడుతున్నాయి. ఎప్పుడైతే సీజీలు తేలిపోతాయో, అప్పటి నుంచీ – సినిమాపై నుంచి ప్రేక్షకుల దృష్టి మరలిపోతుంది. పైగా విపరీతంగా ట్రోల్ అయ్యే ప్రమాదం ఉంది. సీజీల్లో వరల్డ్ క్లాస్ ఎఫెక్టులు ఆశిస్తున్నారు. మిరాయ్లో ఆ శ్రమ కనిపిస్తోంది. ముఖ్యంగా ఈగల్ షాట్.. చాలా బాగా డిజైన్ చేసినట్టు అనిపిస్తోంది. ట్రైలర్లో.. వీఎఫ్ఎక్స్ షాట్స్ బాగా వాడారు. అందులో క్వాలిటీ మేకింగ్ కనిపించింది. సినిమాలో శ్రీరాముడి ఆగమనానికి సంబంధించిన షాట్స్ ఉన్నాయి. అవన్నీ సీజీలతో ముడిపడే సన్నివేశాలే. వాటిని బాగా తీర్చిదిద్దామని టీమ్ చెబుతోంది. అందుకోసం బాగానే ఖర్చు పెట్టింది. దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని మంచి టెక్నీషయన్. కెమెరామెన్ గా తనకు మంచి అనుభవం ఉంది. అది ఈ సినిమాకు ప్లస్ పాయింట్. నిర్మాత విశ్వ ప్రసాద్కు సొంతంగా వీఎఫ్ఎక్స్ స్టూడియోలు ఉన్నాయి. వాటి వల్ల కూడా సీజీల్లో క్వాలిటీ రాబట్టేందుకు ఆస్కారం దొరికి ఉండొచ్చు. హనుమాన్ సినిమా సీజీలకు మంచి పేరొచ్చింది. తక్కువ బడ్జెట్ తో క్వాలిటీ అవుట్ పుట్ తీసుకురాగలిగారు. ఈసారి అదే మ్యాజిక్ రిపీట్ అవుతుందని టీమ్ భావిస్తోంది.
కిష్కంధపురిలో కొన్ని సీజీ షాట్స్ ఉన్నాయి. వాటిపై చిత్రబృందం బాగా శ్రద్ద పెట్టిందని తెలుస్తోంది. ఇది హారర్ సినిమానే అయినా, కొన్ని షాకింగ్ ఎలిమెంట్స్ ఉండబోతున్నాయని, వాటికి సీజీలు అవసరమయ్యాయని చిత్రబృందం చెబుతోంది. ఇవనే కాదు.. ‘అఖండ 2’ లోనూ కొన్ని సీజీ షాట్స్ ఉన్నాయి.వాటి మేకింగ్ కూడా అబ్బురపరుస్తుందని టాక్. విశ్వంభర అయితే పూర్తిగా సీజీల మయం. సీజీలు లేట్ అవ్వడం వల్లే ఈ సినిమా వాయిదా పడింది. టీజర్లో చూపించిన సీజీ షాట్స్ పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. అందుకే.. రీ వర్క్ చేసి, అవుట్ పుట్ పై సంతృప్తి చెందిన తరవాతే విడుదల చేద్దామని డిసైడ్ అయ్యారు. ప్రభాస్ సినిమా `ఫౌజీ`లోనూ సీజీలకు అధిక ప్రాధాన్యత ఉందని తెలుస్తోంది. మైత్రీ మూవీస్ సంస్థ ఈ సినిమా సీజీలపై భారీగా ఖర్చు పెడుతోందట.
ఇది వరకు సీజీలంటే… ఫారెన్ స్టూడియోల వంక చూసేవారు. ఇప్పుడు అలా కాదు. ఇండియాలోనే బెస్ట్ కంపెనీలు ఉన్నాయి. పైగా తక్కువ ఖర్చుతో ఎక్కువ అవుట్ పుట్ సాధించే వీలు దొరుకుతోంది. కావల్సిందల్లా ఓపిగ్గా కూర్చుని, సీజీలు చేయించుకోవడమే. దానికి విజనరీ చాలా అవసరం. అలా ఓ విజన్ తో సీజీలు చేయించుకొంటే తప్పకుండా మంచి ఫలితాలు వస్తాయి. అవే ఓ యావరేజ్ సినిమాని హిట్ చేయగలవు. హిట్ అయ్యే కంటెంట్ ఉన్న సినిమాలు పేలవమైన సీజీలతో యావరేజ్ మార్క్ దగ్గర ఆగిపోయే ప్రమాదం కూడా ఉంది. ఈ విషయంలో ఈ సినిమాలన్నీ జాగ్రత్తగా ఉండాల్సిందే.