భారతదేశంలో ఏ రాష్ట్రంలో అయినా కేంద్ర ప్రభుత్వ సంస్థ సిబిఐ ప్రవేశించాలంటే, అక్కడి కేసులపై విచారణ చేయాలంటే, ఆ రాష్ట్ర అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఢిల్లీ మాత్రం ఇందుకు మినహాయింపు. దాదాపు అన్ని రాష్ట్రాలు ఎప్పటినుంచో దీనికి సమ్మతిస్తూ కేంద్ర ప్రభుత్వంతో నిబంధన చేసుకొని ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో సి.బి.ఐ.ని అనుమతిస్తూ ఎప్పటినుంచో ఉన్న ఈ ఉత్తర్వుల ని ఇప్పుడు ఉపసంహరిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నిర్ణయం కారణంగా ఇక మీదట సిబిఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎటువంటి విచారణ చేయాలన్నా రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ప్రత్యేకంగా తీసుకోవాల్సి ఉంటుంది. రాష్ట్రంలో పనిచేస్తున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల అవినీతి మీద విచారణ చేయాలన్నా కూడా ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పర్మిషన్ తీసుకోవాల్సిందే. ఈ నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలను చెబుతూ సిబిఐ సంస్థ ప్రతిష్ట మసకబారిన కారణంగానే, తెలుగుదేశం ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలుగుదేశం నేతలు, ఆ పార్టీ అభిమానులు అంటున్నారు. తెలుగుదేశం పార్టీ అభిమానులలో మాత్రం ఈ నిర్ణయంపై హర్షం వ్యక్తమవుతోంది. చంద్రబాబు మాస్టర్ స్ట్రోక్ ఇచ్చాడని వారు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ నిర్ణయంపై ఇటు విపక్షాల నుంచే కాకుండా అటు విశ్లేషకుల నుంచి, వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇక ప్రజలను పలు అనుమానాలను ఈ నిర్ణయం రేకెత్తించింది.
సిపిఐ స్పందన:
ఈ నిర్ణయంపై సిపిఐ రామకృష్ణ ఫైర్ అయ్యారు. అక్రమార్కులకు ప్రభుత్వం కొమ్ము కాస్తోంది అని చెప్పటానికి ఇదే నిదర్శనం అని వ్యాఖ్యానించిన సిపిఐ రామకృష్ణ, సిబిఐ , తమ పార్టీ నేతల మీద దాడులు చేయకూడదు అన్నట్టు చంద్రబాబు వ్యవహరించడం సరికాదన్నారు. ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని ఆయన అన్నారు.
వైయస్సార్సీపి స్పందన:
ఇక వైఎస్ఆర్ సీపీ కూడా ఈ నిర్ణయంపై విమర్శల వాన కురిపిస్తోంది. ఇటీవల జగన్ మీద దాడి జరిగిందని, దీనిపై తమ అధినేత సిబిఐ లాంటి థర్డ్ పార్టీ సంస్థతో విచారణ చేయించాలని కోరుతున్నారని, అయితే అలా విచారణ జరిగితే వాస్తవాలు బయటికి వస్తాయి అని బాబు భయపడుతున్నారని అందుకే ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని వైఎస్ఆర్ సీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఎంపీ సీఎం రమేష్ తో సహా పలువురు ఆ పార్టీ నేతలు అక్రమాలకు పాల్పడుతున్నారని, వారందరినీ రక్షించడానికి చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారని వైఎస్ఆర్సిపి ఆరోపించింది. ఇక రాష్ట్రంలో అవినీతి చాలా ఎక్కువగా ఉందని, పోలవరం అవినీతిపై, ఇసుక మాఫియాపై, మైనింగ్ మాఫియాపై పలు ఆరోపణలు ఉన్నాయని, వీటి మీద పలు పార్టీలు పలు సంస్థలు సిబిఐ విచారణ కోరుతున్నాయని, అయితే ఈ మాఫియాలను రక్షించడానికే చంద్రబాబు ఈ నిర్ణయాన్ని తీసుకున్నారని వైఎస్ఆర్సిపి ఆరోపించింది.
ప్రజల్లో అనుమానాలు- ఆపరేషన్ గరుడ సంగతి ఏంటి:
అయితే ఇక్కడ ప్రజల్లో కూడా కొన్ని సందేహాలు వస్తున్నాయి. నిజానికి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని కొన్ని నెలల ముందే తీసుకుంది. ఆ జీవో మీడియాకు లీక్ అవకుండా జాగ్రత్తలు తీసుకుంది. ఇప్పుడు ఆ జీవో ఇచ్చి దాదాపు మూడు నెలల తర్వాత అది వెలుగులోకి వచ్చింది. అయితే ఈ మూడు నెలల కాలంలో, రాష్ట్రంలో ఆపరేషన్ గరుడ జరగబోతోందని, చంద్రబాబు మీద కేంద్ర ప్రభుత్వం సిబిఐ కేసులు పెట్టబోతోందని పలుసార్లు నటుడు శివాజీ ఆరోపణలు చేసి ఉన్నారు. అదేవిధంగా సాక్షాత్తూ ముఖ్యమంత్రి కూడా తన పై దాడులు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని చెప్పి ఉన్నారు. ఈ లెక్కన చూస్తే సిబిఐ తన మీద దాడులు చేసే అవకాశమే లేకుండా అప్పటికే జీవో విడుదల చేసి కూడా, ప్రజల కి మాత్రం, కేంద్ర ప్రభుత్వం సిబిఐ తో దాడులు చేయబోతోందని చెబుతూ ప్రజలను మభ్య పెట్టారా అన్న అనుమానాలు ప్రజల్లో కలుగుతున్నాయి.
మొత్తం మీద:
విపక్షాల తో పాటు పలువురు రాజకీయ విశ్లేషకులు కూడా ఈ నిర్ణయాన్ని తప్పు పడుతున్నారు. నిజంగా కేంద్రం సిబిఐ దాడులు చేయించినా, వాటిని రాజ్యాంగబద్ధంగా ఎదుర్కొని తమ నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలే తప్ప ఇలా విచారణలే జరగకుండా తప్పించుకోవడం సరికాదంటున్నారు.
– జురాన్ (@CriticZuran)