పవన్కల్యాణ్, ప్రభాస్ తప్ప… మహేశ్బాబు, రామ్చరణ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్, రవితేజ, గోపీచంద్, నాగచైతన్య, సాయిధరమ్ తేజ్ తదితర యువ హీరోలందరితో రకుల్ నటించారు. నాలుగంటే నాలుగు ఏళ్లలో 14 తెలుగు సినిమాలు చేశారు. అటువంటి రకుల్ చేతిలో ప్రస్తుతం ఒక్క తెలుగు సినిమా కూడా లేదు. తమిళ, హిందీ సినిమాలు చేస్తున్నారు. తాజాగా ఆమెకు మరో హిందీ సినిమాలో నటించే అవకాశం వచ్చింది. యువ హిందీ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాకు జోడీగా రకుల్ నటించిన సినిమా ‘అయ్యారీ’. అటు విమర్శకులకు, ఇటు ప్రేక్షకులకు నచ్చని ఈ సినిమాకు వసూళ్లు కూడా ఏమంత గొప్పగా రాలేదు. కానీ, సిద్ధార్థ్-రకుల్ జోడీపై మరో దర్శకుడు నమ్మకం వుంచాడు. సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా మిలప్ ఝవేరి దర్శకత్వంలో రూపొందనున్న సినిమా ‘మర్ జవాన్’. ఇందులోని ఇద్దరు హీరోయిన్లలో ఒకరుగా రకుల్ ఎంపికయ్యారు. త్వరలో సినిమా షూటింగ్ ప్రారంభమవుతుందట. అజయ్ దేవగణ్ సరసన రకుల్ నటిస్తున్న రొమాంటిక్ హిందీ సినిమా ‘దే దే ప్యార్ దే’ షూటింగ్ ఇటీవల పూర్తయ్యింది. అలాగే, తమిళంలో సూర్య ‘ఎన్.జి.కె’, కార్తీ ‘దేవ్’, శివ కార్తికేయన్ సరసన ఓ సినిమా… మొత్తం మూడు సినిమాల్లో రకుల్ నటిస్తున్నారు.