సందీప్ కిషన్, తమన్నా సినిమా ఏమైంది? మధ్యలో ఎందుకు పక్కన పెట్టేశారు? అసలు సినిమా వస్తుందా? రాదా? వంటి ప్రశ్నల నుంచి అనూహ్యంగా ‘నెక్స్ట్ ఏంటి?’ సినిమా వార్తల్లోకి వచ్చింది. ‘ఫనా’, ‘హమ్ తుమ్’ వంటి హిందీ హిట్స్ తీసిన కునాల్ కోహ్లీ దర్శకత్వం వహించిన మొదటి తెలుగు సినిమా ఇది. దీపావళికి సినిమా టైటిల్ ప్రకటించారు. ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఈ రోజు (బుధవారం) సాయంత్రం నాలుగున్నరకు… మరి కొన్ని గంటల్లో సినిమా టీజర్ విడుదల చేస్తున్నారు. సినిమా పబ్లిసిటీ స్పీడప్ చేశారు. అసలు విషయం ఏంటంటే.. వచ్చే నెలలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. అవును.. డిసెంబర్ నెలలో ‘నెక్స్ట్ ఏంటి?’ సినిమాను విడుదల చేయాలనేది ప్లాన్. అదీ డిసెంబర్ ఫస్టాఫ్లో!
క్రిస్మస్ వీకెండ్ రావడానికి కుదిరే అవకాశాలు కనిపించడం లేదు. ఆల్రెడీ ‘యాత్ర’, ‘అంతరిక్షం’, ‘పడి పడి లేచె మనసు’, ‘కె.జి.ఎఫ్’ సినిమాలు డిసెంబర్ 21 మీద కర్చీఫ్ వేశాయి. డిసెంబర్ 28న రావడానికి నిఖిల్ ‘ముద్ర’ రెడీ అవుతోంది. అందుకని, డిసెంబర్ ఫస్టాఫ్లో విడుదల చేయాలనుకుంటున్నారు. ప్రచార బాధ్యతలను తమన్నా తన భుజాలపై వేసుకుంది. సందీప్ కిషన్ కూడా ప్రేక్షకుల్లో సినిమాకు క్రేజ్ తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాడు. ఈ రోజు వస్తున్న టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ఇద్దరూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.