కాశ్మీర్ లో ఆర్మీ క్యాంప్ పై పాక్ ఉగ్రవాదుల దాడిలో 17మంది సైనికులు మృతి చెందడంతో యావత్ దేశ ప్రజలలో ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. ఇదివరకు ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు పాకిస్తాన్ కొన్ని రోజులైనా వెనక్కి తగ్గేది. కానీ ఈసారి మాత్రం భారత్ పై ఎదురుదాడి చేస్తుండటం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. యూరీ దాడి జరిగిన మరునాడే కాశ్మీర్ లో 10 మంది ఉగ్రవాదులు చొరబాటుకి విశ్వప్రయత్నాలు చేయడం, వారు కూడా భద్రతాదళాలతో వారు హోరాహోరీ యుద్ధం చేయడం, పాక్ సైన్యాధ్యక్షుడు, రక్షణమంత్రి భారత్ పై అణుబాంబులు ప్రయోగిస్తామని బెదిరించడం, ఐక్యరాజ్యసమితిలో పాక్ ప్రేలాపనలు వంటి చర్యలన్నీ ఏదో యాంత్రికంగా, యాదృచ్చికంగా చేస్తునవిగా కాకుండా అంతా ఒక వ్యూహం ప్రకారమే చేస్తున్నట్లుంది. ఒకదాని తరువాత వరుసగా జరుగుతున్న ఈ పరిణామాలన్నిటినీ కలిపి చూసినట్లయితే కాశ్మీర్ అల్లర్లతోనే పాకిస్తాన్ ఈ వ్యూహం అమలు చేయడం మొదలుపెట్టినట్లు అనుమానం కలుగుతోంది.
పాకిస్తాన్ లో అంతర్గతంగా సమస్యలు పెరిగినప్పుడల్లా వాటిపై నుంచి ప్రజల దృష్టి మళ్ళించేందుకే పాక్ ప్రభుత్వం ఇటువంటి ఎత్తుగడని అమలు చేస్తుంటుంది. పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఉగ్రవాదులలో మంచి ఉగ్రవాదులు, చెడ్డ ఉగ్రవాదులు ఉండరని చిలక పలుకులు పలుకుతూ ఉంటారు కానీ పాక్ లో ఆ రెండు రకాల ఉగ్రవాదులు ఉన్నారని చెప్పక తప్పదు. వారిలో మంచి ఉగ్రవాదులంటే కేవలం భారత్ పై మాత్రమే దాడులు చేసేవారని భావించవచ్చు. వారికి పాక్ ప్రభుత్వం, సైనికాధికారులు, ఐ.ఎస్.ఐ.తదితర సంస్థలన్నీ కావలసిన సహాయ సహకారాలు అందిస్తున్నాయని చాలాసార్లు రుజువయింది. వారి వలన పాక్ ప్రభుత్వానికి ఎటువంటి ఇబ్బంది లేకపోయినా, చెడ్డ ఉగ్రవాదులు, అంటే పాకిస్తాన్ పైనే ఆత్మాహుతి దాడులు చేసేవారి వలన చాలా సమస్యలు, సవాళ్ళు ఎదుర్కొంటోంది.
గత కొన్నినెలలుగా పాకిస్తాన్ లో ఆ చెడ్డ ఉగ్రవాదులు వరుసగా ఏదో ఒక ప్రాంతంలో ఆత్మాహుతి దాడులు చేస్తూ వందలాది పాక్ ప్రజల ప్రాణాలు బలిగొంటున్నారు. వారిని కట్టడి చేయడంలో పాక్ ప్రభుత్వం చాలా ఘోరంగా విఫలం అవడంతో ప్రజలు, ప్రతిపక్షాల నుండి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. బహుశః అందుకే మళ్ళీ భారత్ పై పరోక్ష యుద్ధం ప్రారంభించి ఉండవచ్చు. పాక్ ప్రజల దృష్టిని మళ్ళించేందుకే, భారత్ తమ దేశంపై దాడి చేయబోతోందని…దానిని అణుబాంబులతో నిలువరిస్తామని పాక్ సైన్యాధ్యక్షుడు, రక్షణ మంత్రి చెపుతున్నట్లు భావించవచ్చును.
అయితే పాక్ పై భారత్ ఎన్నడూ ప్రత్యక్ష యుద్దానికి సాహసించదని పాకిస్తాన్ కి కూడా తెలుసు. అయినా మరికొంత కాలం పాటు ఈ వేడిని కొనసాగించేందుకు పాక్ ప్రభుత్వం ప్రయత్నించవచ్చు. పాకిస్తాన్ తన అంతర్గత సమస్యల నుంచి తప్పించుకోవడానికి తరచూ భారత్ పై ఈవిధంగా అల్లర్లు, దాడులు చేస్తుండటం పాకిస్తాన్ కి ఒక ఆటగా మారిపోయింది. అయితే భారత ప్రభుత్వం దాని ఆటకట్టించే ప్రయత్నాలు చేయకుండా, అది కూడా దానితో కలిసి ప్రజాగ్రహం చల్లారేవరకు చాలా హడావుడి చేయడం, ఆ తరువాత దాని గురించి మరిచిపోవడం ఒక దూరలవాటుగా మారిపోయింది. పఠాన్ కోట్ దాడిపై భారత్ నిర్లిప్తత, నిస్సహాయత అందుకు ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అందుకే పాకిస్తాన్ కూడా ఇంత పేట్రేగిపోతోందని చెప్పకతప్పదు. కనుక ఈసారైనా పాక్ ఉగ్రవాదుల చేతిలో ప్రాణాలు కోల్పోయిన భారతీయ సైనికుల ఆత్మశాంతి కోసం, వారి కుటుంబాల ఆవేదన చల్లార్చడం కోసం పాకిస్తాన్ కి గట్టిగా బుద్ధి చెప్పక తప్పదు.