పాక్ భూభాగంలో భారత్ సైనికులు చేపట్టిన ‘సర్జికల్ స్ట్రయిక్స్’ ని చూసి భారత్ ప్రజలు చాలా సంతోషిస్తున్నారు. సంబరాలు చేసుకొంటున్నారు. ఇన్నేళ్ళుగా వారిలో పాక్ పట్ల పేరుకున్న ఆగ్రహావేశాలు ఈవిధంగా బయటపడుతున్నాయని చెప్పవచ్చు. ఈ సాహసోపేతమైన మిలటరీ ఆపరేషన్ ద్వారా భారత ప్రభుత్వం తన ప్రజల అహాన్ని చల్లార్చించిందని చెప్పవచ్చు. భారత ప్రభుత్వం ఏవిధంగా తన ప్రజల, సైనికుల అహాన్ని, ఆత్మవిశ్వాసాన్ని కాపాడుకొందో, ఇప్పుడు పాక్ ప్రభుత్వం కూడా అదేవిదంగా తన ప్రజల, సైనికుల అహాన్ని చల్లార్చవలసి ఉంటుంది. లేకుంటే భారత్ ఒక చిన్న దాడి చేస్తేనే, ఇంతకాలం ప్రగల్భాలు పలికిన పాక్ పాలకులు, సైన్యం చేతకాని దద్దమ్మలలాగ చేతులు ముడుచుకొని కూర్చోన్నారని పాక్ ప్రజలు, ప్రతిపక్షాలు నిందించవచ్చు. ఇప్పటికే నిందిస్తున్నారు కూడా. పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ భారత్ తో చాలా అసమర్ధంగా, పిరికితనంతో వ్యవహరిస్తున్నారని మాజీ క్రికెటర్, పాకిస్తాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ పార్టీ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ ఎద్దేవా చేశారు. భారత్ కి ఏవిదంగా ధీటుగా జవాబు చెప్పాలో తాను నవాజ్ షరీఫ్ కి ఈరోజు చెపుతానని అన్నారు. ఇవ్వాళ్ళ పాకిస్తాన్ లో ఆయన బారీ ర్యాలీ నిర్వహించబోతున్నారు.
పాక్ లో ప్రతిపక్షాలు, మీడియా, ప్రజలు కూడా ప్రభుత్వాన్ని నిందిస్తున్నారు. దానితో పాక్ ప్రభుత్వం కూడా తీవ్ర ఒత్తిడికి గురవుతోంది. కనుక పాక్ నుంచి ఏదో రూపంలో ప్రతీకార చర్య తప్పక ఉంటుంది. దానికి భారత్ ప్రభుత్వం, సైన్యం, యావత్ భారతీయులు సిద్దంగా ఉండక తప్పదు. ఒకవేళ అంతర్జాతీయ ఒత్తిళ్ళ కారణంగా భారత్ పై ప్రత్యక్షంగా యుద్దానికి దిగకపోయినా, పాకిస్తాన్ కి మరో సైన్యం వంటి ఉగ్రవాదులు భారత్ పై విరుచుకు పడటం ఖాయం. సరిహద్దులు దాటి వచ్చి దాడులు చేసేవారిని ఎదుర్కోవడానికి భారత్ సైన్యం సంసిద్దంగా ఉంది. కానీ ఇంటి దొంగలతోనే అసలైన ప్రమాదం. కనుక దేశ ప్రజలు, రాష్ట్ర ప్రభుత్వాలు అందరూ చాలా అప్రమత్తంగా ఉండటం చాలా అవసరం.