యురీ ఆర్మీ క్యాంప్ పై ఉగ్రవాదుల దాడి తరువాత పాకిస్తాన్ వరుసగా తప్పటడుగులు వేస్తోంది. ఐక్యరాజ్యసమితి సమావేశాలు జరుగబోతున్న సమయంలోనే ఈ దాడి జరుగడం, ఆ మరునాటి రోజు నుంచే కాశ్మీర్ లోకి ఉగ్రవాదులు చొరబడేందుకు ప్రయత్నిస్తుండటం వారిని భారత సేనలు మట్టుబెడుతుండటాన్ని ప్రపంచ దేశాలన్నీ గమనిస్తూనే ఉన్నాయి. భారత్ పై జరుగుతున్న ఉగ్రవాదుల దాడులతో తమ దేశానికేమీ సంబంధం లేదని పాక్ వాదిస్తున్నప్పటికీ, భారత్-పాక్ సరిహద్దుల వద్ద కాశ్మీర్ లోనే జరుగుతుండటంతో భారత్ పై జరుగుతున్న ఆ దాడులన్నీ పాక్ ప్రేరేపితమేనని అందరికీ అర్ధం అవుతోంది.
ఐక్యరాజ్యసమితిలో పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ కాశ్మీర్ అంశం గురించి మాట్లాడుతూ భారత్ భద్రతాదళాల చేతిలో హతమైన హిజ్బుల్ ముజాహుద్దీన్ ఉగ్రవాది బుర్హాన్ వనీని వెనకేసుకువస్తూ మాట్లాడి మరో పెద్ద పొరపాటు చేశారు. పాక్ ప్రధాని స్వయంగా ఒక ఉగ్రవాదిని వెనకేసుకు రావడం చూస్తే ఆ దేశం ఉగ్రవాదులని తయారు చేసి, వారిని భారత్ పై దాడులకి ప్రోత్సహిస్తోందని రుజువు అయ్యిందని సుష్మా స్వరాజ్ వాదించారు.
కాశ్మీర్ లో అల్లర్లని స్వాతంత్ర్య పోరాటంగా, బుర్హాన్ వనీని స్వాతంత్ర్య సమరవీరుడిగా పాక్ అభివర్ణించి వారికి మద్దతు ప్రకటించడం ద్వారా కాశ్మీర్ లో అల్లర్లకి పాకిస్తానే కారణమని, అది ఉగ్రవాదులకి వేర్పాటువాదులకి అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తున్నట్లు రుజువు చేసుకొంది. ఇప్పుడు పాక్ ప్రధాని స్వయంగా బుర్హాన్ వనీకి మద్దతుగా ఐక్యరాజ్యసమితిలో మాట్లాడటం ద్వారా భారత్ చేస్తున్న ఆరోపణలన్నీ నిజమని రుజువయింది.
పాక్ చేసిన మరో పెద్ద తప్పు ఏమిటంటే, యుద్ధం గురించి మాట్లాడటం. భారత్ పై అణుబాంబులు ప్రయోగిస్తామని బెదిరించడం. భారత్ అటువంటి పదాలు వాడకుండా చాల జాగ్రత్తగా దౌత్యపద్ధతులకి అనుగుణంగా, ఆమోదయోగ్యంగా మాట్లాడింది. కానీ ఆ విషయంలో కూడా పాక్ నోరు జారింది. దానితో పాక్ లో ఉన్న అణ్వాయుధాలు, వాటి భద్రత గురించి ప్రపంచదేశాలు ఆందోళన వ్యక్తం చేయడం మొదలుపెట్టాయి. ఈ విషయంలో అమెరికా విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ కి గట్టిగా హెచ్చరించినట్లు వార్తలు వస్తున్నాయి.
కల్లు తాగిన కోతి చేతికి కొబ్బరికాయ చిక్కితే అది ఎప్పుడు, ఎందుకు, ఎవరి మీదకి విసురుతుందో తెలియనట్లే ఉగ్రవాదులు, యుద్దోన్మాద సైనికాధికారులతో నిండి ఉన్న పాకిస్తాన్ చేతిలో భయంకరమైన అణ్వాయుధాలు ఉండటం కూడా అంతే ప్రమాదం. వారి చేతుల్లో కీలుబొమ్మగా ఉన్న పాక్ ప్రభుత్వం వాటిని వారికి అందకుండా కాపాడగలదా? కాపాడలేకపోతే భారత్ పరిస్థితి ఏమిటి? ప్రపంచ దేశాల భాద్యత ఏమిటి? అందరూ ఆలోచించాలి.