భారత్ సైనిక దళాలు పాక్ లో అడుగుపెడితే అణుబాంబులతో భారత్ పైకి విరుచుకుపడతామని ప్రగల్భాలు పలికిన పాకిస్తాన్ ఇప్పుడు మాట మార్చి భారత్ అసలు అటువంటి ఆపరేషన్ నిర్వహించ లేదు. కేవలం సరిహద్దుల వద్ద కాల్పులు జరిపింది. దానిలో ఇద్దరు పాక్ సైనికులు మరణించారు..మరో 9 మంది గాయపడ్డారని సర్దిచెప్పుకొంటోంది. అది ఆ మాటకే కట్టుబడి ఉంటే అది భారత్ కి కూడా మంచిదే. తమ దేశంపై భారత్ దాడి చేయలేదని పాక్ స్వయంగా చెప్పుకొంటోంది కనుక అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించలేదు. కానీ దాడి జరుగలేదు అంటూనే పాక్ ప్రభుత్వం భారత్ హైకమీషనర్ గౌతం బంబ్వాలేకి సమన్లు పంపింది. పాక్ భూభాగంలో భారత్ నిర్వహించిన ఆర్మీ ఆపరేషన్ కి సంజాయిషీ ఇవ్వాలని, ఆ దాడులని ఏవిధంగా సమర్దించుకొంటారో వివరణ ఇవ్వాలని కోరింది. అంటే భారత్ దాడులు చేసినట్లు అంగీకరిస్తోందన్న మాట!
గత 3-4 దశాబ్దాలుగా పాక్ ప్రేరిత ఉగ్రవాదులు భారత్ లో నగరాలపై దాడులు చేస్తూ వందలాది మంది ప్రజలని పొట్టన పెట్టుకొంటూనే ఉన్నారు. మళ్ళీ మొన్న యూరీ ఆర్మీ క్యాంప్ పై దాడులు చేసి నిద్రిస్తున్న 18మంది సైనికులని అతి దారుణంగా మంటలు అంటించి, వారిపై గ్రెనేడ్లతో దాడులు చేసి హత్యలు చేశారు. ఇక సరిహద్దులలో పాక్ సైనికుల ఆగడాలు అన్నీ ఇన్నీ కావు. ఏడాదిన్నార క్రితం ఇద్దరు భారతీయ సైనికుల శిరస్సులు నరికి పట్టుకు పోయారు. వీలు చిక్కినప్పుడల్లా సరిహద్దు గ్రామాలపై దాడులు చేస్తూ వందలాది మంది గ్రామీణులు, వారి పశువులని కూడా చంపుతున్నారు.
ఇన్ని దశాబ్దాలుగా భారత్ లో ఇంత నరమేధం సృష్టిస్తున్న పాకిస్తాన్, దాని సరిహద్దులలో దాగి ఉన్న ఉగ్రవాదులపై భారత్ సేనలు దాడులు చేస్తే సహించలేకపోతోంది. అది తమని యుద్దానికి కవ్వించడంగానే భావిస్తోంది. పార్లమెంటుపై దాడులు, ముంబైలో దాడులు, పఠాన్ కోట్ పై దాడులు భారత స్వార్వభౌమత్వాన్ని సవాలు చేయడం కాదా? అయినా ఇంత కాలం వెన్నెముకలేని పాలకులు భారత్ ని పరిపాలించడం వలన పాక్ తప్పించుకోగలిగింది. ప్రధాని నరేంద్ర మోడీ కూడా మొదట పాకిస్తాన్ తో స్నేహమే కోరుకొన్నారు తప్ప కయ్యానికి కాలు దువ్వలేదు. పాక్ ఉగ్రవాదులు భారత్ పై దాడులు కొనసాగిస్తున్నా ఇంతకాలం ఆయన కూడా చాలా సహనం వహించారు. కానీ, మోడీని పాక్ చాలా తక్కువ అంచనా వేసి పెద్ద పొరపాటు చేసింది. ఆయన ఎటువంటివారో యావత్ ప్రపంచం గ్రహించింది కానీ పాకిస్తాన్ మాత్రం అయనని అర్ధం చేసుకోలేకపోయింది. అయన సహనాన్ని అసమర్ధతగానే భావిస్తూ చేయకూడని పాడు పనులన్నీ చేసింది. కాశ్మీర్ లో గత రెండు నెలలుగా అది చేసిన నిర్వాకానికి సుమారు 80 మంది పౌరులు బలైయ్యారు. 2,000 మందికి పైగా గాయలపాలైయ్యారు. అయినా మోడీ సహిస్తూనే వచ్చారు. కానీ పిల్లినయినా గదిలో బందించి కొడితే అది తిరుగబడుతుంది. ఇప్పుడు భారత్ కూడా అదే చేసింది.
ఇప్పుడు బంతి పాక్ కోర్టులో ఉంది. ఏమి చేస్తుందో, దానిని భారత్ ఏవిధంగా ఎదుర్కోబోతోందో త్వరలోనే తెలుస్తుంది. ఇంకా మాటల్లేవ్…అన్నీ చేతలే!