కాటమరాయుడికి ఏ ముహూర్తంలో కొబ్బరికాయ్ కొట్టారో గానీ.. ఓ అడుగు ముందు పడుతోంటే…నాలుగు అడుగులు వెనక్కి వెళ్తోంది. ముందు ఎస్.జె సూర్యని దర్శకుడిగా తీసుకొన్నారు. ఆ తరవాత డాలీ వచ్చాడు. ఇప్పుడు మరో టెక్నీషియన్ జంప్ అయ్యాడు. కాటమరాయుడు సినిమా కోసం కెమెరామెన్గా సౌందర్ రాజన్ ని తీసుకొన్నారు. ఇప్పుడు సౌందర్ ఈ టీమ్కి బై బై చెప్పేసి వెళ్లిపోయాడు. అతని స్థానంలో మరో సీనియర్ కెమెరామెన్ ప్రసాద్ మురెళ్ళ ను తీసుకున్నారని సమాచారం. పవన్ కల్యాణ్ అత్తారింటికి దారేది చిత్రానికి కెమెరామెన్గా పనిచేసింది ఆయనే. సర్దార్ గబ్బర్ సింగ్ విషయంలోనూ ఇలాంటి మార్పులూ చేర్పులూ చోటు చేసుకొన్నాయి. కెమెరామెన్లు కూడా మారారు. ఇప్పుడు సేమ్ కాటమరాయుడుకీ అదే సీన్ రిపీట్ అవుతోంది. మున్ముందు ఇంకెంత మంది వచ్చిపోతుంటారో? బుధవారం నుంచి కాటమరాయుడు రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్లో మొదలైంది. 15 రోజుల పాటు ఏకథాటిగా హైదరాబాద్లోనే చిత్రీకరణ సాగనుంది. ఆ తరవాత ఓ వారం రోజుల గ్యాప్ తీసుకొని, ఆ తరవాత మరో సుదీర్ఘమైన షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు. 2017 వేసవికి ముందే ఈ చిత్రాన్ని విడుదల చేయాలన్నది చిత్రబృందం ఆలోచన.