బనకచర్ల ప్రాజెక్టుపై తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ వివాదం రేగడంతో కేంద్రం జాగ్రత్తపడింది. పర్యావరణ అనుమతులు ఇచ్చేందుకు నిరాకరించిది. పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంపిన ప్రాథమిక రిపోర్టును పరిశీలించిన కేంద్ర పర్యావరణ నిపుణుల కమిటీ పలు అంశాలపై అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వలేమని స్పష్టం చేసింది. ప్రాజెక్టుపై అనేక అభ్యంతరాలు వచ్చాయని..అనుమతులు ఇవ్వాలంటే జీడబ్ల్యూడీటీ అవార్డు పరిశీలించాల్సి ఉందని కమిటీ తెలిపింది.
పర్యావరణ అనుమతులకు సీడబ్ల్యూసీని సంప్రదించడం అత్యవసరమని ఏపీకి సమాచారం ఇచ్చింది. ఈ ప్రాజెక్టు జీడబ్ల్యూడీటీ తీర్పు ఉల్లంఘించినట్లవుతుందని ఫిర్యాదులు వచ్చాయని వాటన్నింటినీ పరిశీలించాల్సి ఉందని తెలిపింది. సీడబ్ల్యూసీ అంటే సెంట్రల్ వాటర్ కమిషన్ లోనే ఇప్పుడు ఏపీ ప్రభుత్వం ప్రయత్నాలు చేయనుంది. తమ ప్రతిపాదనలు, డీపీఆర్ను సీడబ్ల్యూసీకి సమర్పిస్తే.. అన్ని అంశాలపై పరిశీలన చేసి అనుమతులు ఇవ్వాలా లేదా అన్నది నిర్ణయం తీసుకునే అవకాశం ఉది.
గోదావరి వరద నీరు సముద్రంలోకి వందల టీఎంసీలు పోతున్నాయని వాటిని రాయలసీమకు మళ్లించుకుంటామని చంద్రబాబు బనకచర్ల ప్రాజెక్టును ప్లాన్ చేశారు. దిగువ రాష్ట్రమైన ఏపీ.. సముద్రంలోకి పోయే నీటినే మళ్లించుకుంటామంటే.. తెలంగాణలో రాజకీయం జరిగింది. అనేక ఫిర్యాదులు కేంద్రానికి చేశారు. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా వెళ్లి కేంద్రానికి ఫిర్యాదు చేశారు. చివరికి అనుమతులు ఇవ్వడానికి కేంద్రం వెనుకడుగు వేసింది.