కృష్ణా జిల్లా గన్నవరం తెదేపా ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై పోలీసులు నిన్న కేసు నమోదు చేసారు. జిల్లాలో రామవరప్పాడు గ్రామం వద్ద కలువ గట్లపై అక్రమకట్టడాలను రెవెన్యూ అధికారులు పోలీసుల సహాయంతో తొలగిస్తుండగా, నిర్వాసితులు వారిని అడ్డుకొనే ప్రయత్నంలో ధర్నా చేపట్టారు. ఆ సంగతి తెలుసుకొన్న గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వెంటనే అక్కడికి చేరుకొని పోలీసులు, రెవెన్యూ అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఆ తరువాత ఆయన కూడా నిర్వాసితులతో కలిసి ధర్నాలో పాల్గొన్నారు. తమ పనికి ఆటంకం కలిగించినందుకు పోలీసులు వల్లభనేని వంశీపై కేసు నమోదు చేసారు. అధికార పార్టీకి చెందిన తనపైనే పోలీసులు కేసు నమోదు చేయడంతో ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ అందుకు నిరసనగా ఆయన తన ఇద్దరు గన్ మేన్ లను ప్రభుత్వానికి అప్పగించేరు. కాలువ గట్లపై అక్రమ కట్టడాల తొలగింపు కార్యక్రమం కాస్తా ఇప్పుడు తెదేపా అంతర్గత సమస్యగా మారింది.