టీడీపీ నేతల్ని పోలీసులు రౌండప్ చేశారు. ఎక్కడికీ కదలకుండా మార్కింగ్ చేసేశారు. పల్నాడులోని కీలక నేతలను ఇప్పటికే హౌస్ అరెస్ట్ చేశారు. గుంటూరులో .. ఉంటున్న ముఖ్య నేతలపై గురి పెట్టారు. ముఖ్యనేతల కదలికలపై పోలీసులు ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. టీడీపీ కార్యాలయం, బాధితుల శిబిరం, టీడీపీ ముఖ్య నేతల ఇళ్ల వద్ద పోలీసుల్ని మోహరించారు. ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న టీడీపీ నేతల్ని ఎక్కడికక్కడ అరెస్ట్ చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. బుధవారం..తెలుగుదేశం పార్టీ నేతలు… వైసీపీ నేతల దాడులకు గురైన గ్రామస్తుల్ని తీసుకుని ఆత్మకూరు వెళ్లడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. పెద్ద ఎత్తున పాల్గొనేందుకు టీడీపీ నేతలు సిద్ధమయ్యారు.
తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసిన పునరావాస శిబిరంలో దాదాపుగా 200 మంది ఉన్నారు. వీరందర్నీ పోలీసులు గ్రామాలకు తీసుకెళ్లాలన్న చంద్రబాబు చాలెంజ్ ను మొదట పోలీసులు లైట్ తీసుకున్నారు. కానీ.. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో బాధితులను పునరావాస శిబిరం నుంచి గ్రామాలకు తీసుకెళ్తామని, ఎటువంటి ఇబ్బందిలేకుండా చూస్తామని పోలీసులు హామీ ఇచ్చారు. అయితే సమస్య ఒక్క పల్నాడులో మాత్రమే లేదని.. రాష్ట్రం మొత్తం ఉందని.. టీడీపీ చెబుతోది. అక్రమ కేసులను ఎత్తివేయటమే కాకుండా బాధితులకు.. నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. దాంతో బాధితులు పోలీసులతో వెళ్లేందుకు సిద్ధపడలేదు. అయితే బాధితుల శిబిరం వద్ద.. పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. పదుల సంఖ్యలో వాహనాలు సిద్ధం చేశారు. బలవంతంగా వారిని ఆయా గ్రామాలకు తీసుకెళ్లి విడిచి పెట్టేందుకు ఏ క్షణమైనా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
టీడీపీ నేతలు మాత్రం… పోలీసుల నిర్బంధానికి… విరుగుడు ఆలోచిస్తున్నారు. విభిన్న మార్గాల ద్వారా పల్నాడుకు చేరుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. చంద్రబాబును పోలీసులు ఇంటి వద్ద లేకపోతే.. శిబిరం వద్ద అదుపులోకి తీసుకునే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో వైసీపీ నేతలు కూడా మరో తరహా రాజకీయం ప్రారంభించారు. పోటీగా వైసీపీ నేతలు కూడా… ఓ ర్యాలీకి సిద్ధమయ్యారు. తాము కూడా.. టీడీపీ బాధితులతో కలిసి చలో ఆత్మకూరు నిర్వహిస్తున్నామని… ఆ పార్టీ నేతలు ప్రకటించారు. దీని కోసం పోలీసుల్ని పర్మిషన్ కూడా అడిగారు.