రిలయన్స్ ఏపీలో వివిధ రంగాల్లో భారీ పెట్టుబడులకు ముందుకు వస్తోంది. ఇప్పటికే అరవై ఐదు వేల కోట్ల పెట్టుబడుల ప్రణాళికల్ని ప్రకటించింది. వాటికి సంబంధించిన గ్రౌండింగ్ ప్రక్రియ ప్రారంభమయింది. కొత్తగా.. కర్నూలు జిల్లాలో బెవరేజెస్ ప్లాంట్ పెట్టాలని నిర్ణయించుకుంది. వెనుకబడిన కర్నూలు జిల్లాలో రిలయన్స్ ప్లాంట్ పారిశ్రామిక అభివృద్ధికి ఊతం అయ్యే అవకాశం ఉంది.
రిలయన్స్ విభిన్న రంగాల్లో భారీ పెట్టుబడులు పెడుతోంది. దేశవ్యాప్తంగా విస్తృతమైన సూపర్ మార్కెట్ వ్యవస్థలో సొంత బ్రాండ్ల ఉత్పత్తులను విక్రయిస్తోంది. వాటికి కావాల్సిన ఉత్పత్తులను ఇక్కడ తయారు చేసే అవకాశం ఉంది. బెవరెజెస్ యూనిట్ అలాంటివి సక్సెస్ అయితే ఇతర అనుబంధ పరిశ్రమలతో పాటు అలాంటి ఉత్పత్తుల ఫ్యాక్టరీలు ఇతర కంపెనీలు పెట్టే అవకాశం ఉంది.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాయలసీమను తయారీ రంగానికి హబ్ గా చేయాలన్న పట్టుదలతో పరిశ్రమల్ని ఆకర్షిస్తున్నారు. అనంతపురం, కడప కొప్పర్తి ఇండస్ట్రియల్ ఏరియా, చిత్తూరు, కర్నూలులో వివిధ రకాల తయారీ రంగ పరిశ్రమల ప్రతిపాదనలు తెరపైకి వచ్చాయి. వాటిలో సగం గ్రౌండ్ అయినా రాయలసీమ యువతకు లక్షల్లో ఉద్యోగాలు లభిస్తాయి.