యుపిలో అధికార సమాజ్ వాది పార్టీనిలువునా రెండుగా చీలిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మూలాయం సింగ్ యాదవ్, ఆయన కొడుకు, రాష్ట్ర ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ మద్య ములాయం సోదరుడు శివపాల్ యాదవ్ కారణంగా తీవ్రవిభేదాలు ఏర్పడటంతో ముగ్గురూ కత్తులు దూసుకొంటున్నారు.
కొద్ది రోజుల క్రితమే అఖిలేష్ యాదవ్ ని పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తొలగించి, ఆయన స్థానంలో తన తమ్ముడు శివపాల్ యాదవ్ ని అధ్యక్షుడుగా నియమించడంతో తండ్రి కొడుకుల మధ్య యుద్ధం తీవ్రం అయ్యింది. అందుకు ప్రతీకారం తీర్చుకొంటూ శివపాల్ సింగ్ యాదవ్ నిర్వహిస్తున్న మూడు కీలక మంత్రి పదవులని అఖిలేష్ యాదవ్ వెనక్కి తీసేసుకొన్నారు. శివపాల్ యాదవ్ కూడా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా అఖిలేష్ యాదవ్ సన్నిహితులైన ముగ్గురు ఎమ్మెల్సీలని, మరో ఆరుగురు యువనేతలని క్రమశిక్షణ పేరిట పార్టీ నుంచి బహిష్కరించారు. అది సరిపోదన్నట్లు ఈరోజు ములాయం సింగ్ యాదవ్ కూడా కొడుక్కి మరో పెద్ద షాక్ ఇచ్చారు. అఖిలేష్ యాదవ్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న అమర్ సింగ్ ని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తున్నట్లు ప్రకటించారు. స్వంత తండ్రి, బాబాయ్ ఇద్దరూ కలిసి ఇస్తున్న ఈ షాకులని అఖిలేష్ యాదవ్ జీర్ణించుకోలేకపోతున్నారు.
పార్టీకి ప్రభుత్వానికి మద్య స్వంత తండ్రే అడ్డుగోడ కట్టేసి, పార్టీపై ఏ మాత్రం అధికారం, పెత్తనం లేకుండా చేయడంతో అఖిలేష్ యాదవ్ కి చాలా అవమానకర పరిస్థితులని ఎదుర్కొంటున్నారు. వారిపై తిరగబడితే తక్షణమే తన ప్రభుత్వానికి సమాజ్ వాది ఎమ్మెల్యేల మద్దతు ఉపసంహరింపజేసి ముఖ్యమంత్రి పీఠం నుంచి దింపేసే ప్రమాదం ఉంది కనుక అఖిలేష్ యాదవ్ మౌనంగా అదును కోసం ఎదురుచూస్తున్నారు. శివపాల్ యాదవ్ ఇదివరకే ముఖ్యమంత్రి కావాలని ఆశ పడ్డారు. కనుక వచ్చే ఏడాది జరుగబోయే ఎన్నికల తరువాత మళ్ళీ సమాజ్ వాది పార్టీయే అధికారంలోకి వస్తే ఈసారి ఆయన ఆ అవకాశాన్ని వదులుకోరు. కనుక అఖిలేష్ యాదవ్ తన ముఖ్యమంత్రి పదవి కాపాడుకోవడానికి ఎన్నికలలోగానే పార్టీని చీల్చినా చీల్చవచ్చు. అదే జరిగితే యూపిలో అధికారంలోకి రావాలని తహతహలాడుతున్న కాంగ్రెస్ పార్టీ, భాజపా, బి.ఎస్.పి.లకి ఒక గొప్ప అవకాశం వచ్చినట్లే అవుతుంది.