కుబేర సినిమాపై దర్శకుడు శేఖర్ కమ్ముల చూపిస్తున్న కాన్ఫిడెన్స్ చూస్తుంటే ముచ్చటగా ఉంది. ఆయన ఇండస్ట్రీకి వచ్చి 25 సంవత్సరాలు అవుతోంది. కానీ ఇప్పటివరకు ఏ సినిమాపై చూపనంత నమ్మకాన్ని కుబేరపై చూపిస్తున్నారు.
“ఇది సరస్వతీ దేవి తలెత్తుకుని చూసే సినిమా. ఇలాంటి సినిమా ఇప్పటివరకు ఎప్పుడూ చూసివుండరు. ఇంత అద్భుతమైన కథ నాకు దక్కడం నా అదృష్టం. సినిమా అద్భుతంగా వచ్చింది’ వంటి భారీ స్టేట్మెంట్లు శేఖర్ కమ్ముల నుండి రావడం నిజంగా కొత్తగా ఉంది.
ధనుష్, నాగార్జున, రష్మిక లాంటి పెద్ద స్టార్ కాస్ట్తో పని చేయడం శేఖర్కు ఈ తొలిసారి. అలాగే దేవి శ్రీ ప్రసాద్ లాంటి మాస్ మ్యూజిక్ డైరెక్టర్తో ‘కుబేర’ కోసం ఆయన జతకట్టారు. కాంబినేషన్ పరంగా చూస్తే కుబేర ఓ క్రేజీ ప్రాజెక్ట్గానే కనిపిస్తోంది.
నిన్న ట్రైలర్ కూడా విడుదల చేశారు. శేఖర్ తన మార్క్ దాటి, ఏదో కొత్త పాయింట్ పట్టుకున్నట్లు ట్రైలర్ను చూస్తే స్పష్టంగా తెలుస్తోంది. దీనికి తోడు స్వయంగా రాజమౌళి “ట్రైలర్ మైండ్ బ్లోయింగ్గా ఉంది” అని ప్రశంసించడం కుబేర టీంలో మరింత నమ్మకాన్ని పెంచింది.
ఒక రచయిత, దర్శకుడిగా శేఖర్ అవుట్ ఆఫ్ ది బాక్స్ పాయింట్తోనే కుబేరను మలిచారు. లేకపోతే ఆయన ఇంత కాన్ఫిడెంట్గా ఉండేవారు కాదేమో. అయితే ఆయన అనుకుంటున్న ఆ పాయింట్ ప్రేక్షకులతో ఎంతవరకు కనెక్ట్ అవుతుంది అనేదే సినిమా సక్సెస్ను నిర్ణయిస్తుంది. ఇంకా మూడు రోజుల్లో ఫలితం తేలిపోతుంది. శేఖర్ నమ్మకం నిజం కావాలని కోరుకుందాం. ఎందుకంటే ప్రస్తుతం పరిశ్రమకి ఓ మంచి హిట్ అత్యవసరం.