రియల్ ఎస్టేట్ రంగంలో దేశంలోనే అతిపెద్ద పరిష్కారాలలో ఒకటిగా నిలిచే సూపర్ టెక్ కేసులో సుప్రీం కోర్టు చారిత్రక తీర్పు వెలువరించింది. దీంతో సుమారు 50 వేల మంది గృహ కొనుగోలుదారుల దశాబ్దాల నిరీక్షణకు ఎట్టకేలకు తెరపడనుంది. దాదాపు 15-20 ఏళ్లుగా నిలిచిపోయిన సూపర్ టెక్ సంస్థకు చెందిన 16 హౌసింగ్ ప్రాజెక్టులను ప్రభుత్వ రంగ నిర్మాణ సంస్థ అయిన NBCC కు అప్పగిస్తూ సుప్రీం కోర్టు తుది తీర్పు ఇచ్చింది. గతంలో నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఆదేశాలను సుప్రీం కోర్టు సమర్థించింది. ప్రాజెక్టు మేనేజ్మెంట్ కన్సల్టెంట్గా NBCC ఈ పనులను పర్యవేక్షిస్తుంది. నోయిడా, గురుగ్రామ్ వంటి కీలక నగరాల్లో విస్తరించి ఉన్న సుమారు 51,000 ఫ్లాట్ల నిర్మాణాన్ని పూర్తి చేయడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.
చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం, రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 కింద తనకు ఉన్న అసాధారణ అధికారాలను ఉపయోగించి ఈ తీర్పునిచ్చింది. బాధితులకు పూర్తి న్యాయం చేయడమే పరమావధిగా భావించిన కోర్టు, ఇతర క్రెడిటర్ల బకాయిల కంటే గృహ కొనుగోలుదారుల ప్రయోజనాలకే ప్రథమ ప్రాధాన్యత ఇచ్చింది.
ఈ ప్రాజెక్టులను పూర్తి చేయడానికి సుమారు రూ. 9,500 కోట్ల వ్యయం అవుతుందని అంచనా. NBCC ఈ పనులను వచ్చే మూడు ఏళ్లలో పూర్తి చేయాలని కోర్టు స్పష్టమైన గడువును విధించింది. నీరు, విద్యుత్, డ్రైనేజీ వంటి కనీస వసతులతో పాటు అమ్మకం సమయంలో వాగ్దానం చేసిన అన్ని సౌకర్యాలను భౌతికంగా అందించాలని ఆదేశించింది. నిర్మాణ పనులకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా ఉండేందుకు, మరే ఇతర కోర్టులు లేదా ట్రిబ్యునళ్లు ఈ ప్రక్రియలో జోక్యం చేసుకోకూడదని కూడా సుప్రీం కోర్టు ఆంక్షలు విధించింది.
ఈ తీర్పుతో గత పదిహేను ఏళ్లుగా అటు అద్దెలు కట్టలేక, ఇటు బ్యాంకు ఈఎంఐలు భారమై కుంగిపోతున్న వేలాది మధ్యతరగతి కుటుంబాలకు గొప్ప భరోసా లభించింది. ఆమ్రపాలి కేసులో అనుసరించిన మాడల్నే ఇక్కడ కూడా అమలు చేయడం వల్ల, నిలిచిపోయిన మిగతా రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులకు కూడా ఇదొక రోడ్ మ్యాప్ లా మారుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.