కర్ణాటక ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఈరోజు గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. సెప్టెంబర్ 28 నుంచి 30 వరకు తమిళనాడుకి కావేరీ నీళ్ళు వదలాలని తన ఆదేశాలని పాటించనందుకు ఆగ్రహం వ్యక్తం చేసింది. అక్టోబర్ 1 నుంచి 6 వరకు రోజుకు 6,000 క్యూసెక్కుల తమిళనాడుకి తప్పనిసరిగా నీళ్ళు విడుదలచేయాలని ఆదేశించింది. కర్ణాటక ప్రభుత్వానికి ఇదే చివరి హెచ్చరిక అని స్పష్టంగా చెప్పింది. ఈసారి తన ఆదేశాలని నిర్లక్ష్యం చేస్తే సహించబోనని కూడా హెచ్చరించింది. అలాగే ఈ వివాదం పరిష్కారం కోసం అక్టోబర్ 4వ తేదీ లోగా కావేరీ రివర్ బోర్డుని ఏర్పాటు చేయాలని, రేపటిలోగానే దానికి సభ్యులని నియమించాలని కేంద్రప్రభుత్వాన్ని కూడా ఆదేశించింది.
కావేరీ జలాలు విడుదల చేయాలని సుప్రీంకోర్టు మొదటిసారి ఆదేశాలు జారీ చేసినప్పుడు కర్నాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. దానిలో పాల్గొన్న ప్రతిపక్షాలు సుప్రీంకోర్టు ఆదేశాలని పట్టించుకోవద్దని, అవసరమైతే ముఖ్యమంత్రికి తాము అండగా నిలబడతామని హామీ ఇచ్చాయి. మంత్రివర్గ సభ్యులు కూడా అలాగే చెప్పడంతో కర్ణాటక ప్రభుత్వం తమిళనాడుకి నీళ్ళు విడుదల చేయలేదు. ఈ నేపధ్యంలో గురువారం జరిగిన విచారణలో సుప్రీంకోర్టు కర్ణాటక ప్రభుత్వానికి ఈ హెచ్చరికలు, ఆదేశాలు జారీ చేసింది. ఈసారైనా సుప్రీంకోర్టు ఆదేశాలని సిద్ద రామయ్య పాటిస్తారో లేదో? పాటించక పోతే సుప్రీంకోర్టు ఎటువంటి చర్యలు తీసుకొంటుందో? చూడాలి.