పీవోకే లోని ఉగ్రవాద శిబిరాలను భారత సైన్యం ధ్వంసం చేయడం పాకిస్తాన్ కు పెద్ద షాక్. అయినా మనతో నేరుగా యుద్ధం చేసేటంత సీన్ లేదని అక్కడి పాలకులకు తెలుసు. అందుకే, మన దేశంలో ఉన్న ఉగ్రవాదుల చేత దాడులు చేయించే ప్రమాదం ఉంది. దీంతోదేశవ్యాప్తంగా బలగాలు అప్రమత్తమయ్యాయి. ముఖ్యంగా జమ్ము కాశ్మీర్ తో పాటు పంజాబ్, గుజరాత్, రాజస్థాన్ లను పాక్ ప్రేరేపిత ముష్కరులు టార్గెట్ చేయవచ్చంటూ అప్రమత్తం చేశారు.
ఉగ్రవాదుల అతిపెద్ద టార్గెట్ హైదరాబాద్, ముంబై కావచ్చని ఇంటెలిజెన్స్ వర్గాల హెచ్చరిక. ముంబైలో జరిగినన్ని ఉగ్రవాద దాడులు మరే నగరంలోనూ జరగలేదేమో. అక్కడ పాకిస్తానీ స్లీపర్ సెల్స్ పెద్ద సంఖ్యలోనే ఉంటాయని అంచనా. అలాగే హైదరాబాద్ లోనూ లష్కరే, ఇతర ఉగ్రవాద సంస్థల స్లీపర్ సెల్స్ భారీగానే ఉండొచ్చు. ఒకప్పుడు హైదరాబాద్ అంటే ఐఎస్ఐ అడ్డాగా ఉండేది. పోలీసులు సీరియస్ గా దృష్టిపెట్టి చాలా మంది ఐఎస్ఐ ఏజెంట్లను పట్టుకున్నారు. అయినా, స్లీపర్ సెల్స్ ఉండే అవకాశం ఉందన్నది నిఘా అధికారుల హెచ్చరిక.
ఇది దసరా నవరాత్రి ఉత్సవాల సమయం. మండపాల్లో వేలాది మంది గుమిగూడి ఉంటారు. దైవ దర్శనం, సాంస్కృతిక కార్యక్రమాల సందడిలో ఉంటారు. అలాంటి సమయంలో ఏ మాత్రం ఆదమరిచినా అదును చూసి దాడి చేయడానికి ఉగ్రవాదులు ప్రయత్నిస్తారని ఐబీ, రా అధికారులు హెచ్చరించినట్టు సమాచారం.
నవరాత్రి ఉత్సవాల సందర్భగా భద్రతను కట్టుదిట్టం చేయాలనే సూచన, పలు రాష్ట్రాల్లోవెంటనే అమలైంది. ముఖ్యంగా రాజస్థాన్, గుజరాత్, పంజాబ్ తో పాటు ముంబైలోనూ భారీగా బలగాలను మోహరించారు. హైదరాబాద్ లోనూ పోలీసులు అప్రమత్తమయ్యారు. అవసరమైతే అదనపు బలగాలు, కేంద్ర బలగాలను మోహరిస్తామంటున్నారు పోలీసులు. దేశంలో ప్రతీకార దాడులు చేయాలంటే హైదరాబాద్ ను ఎంచుకోవడం టెర్రరిస్టులకు ఈ మధ్య అలవాటుగా మారింది. షెల్టర్ జోన్ కాస్తా యాక్టివ్ జోన్ అయింది. అందుకే, హైదరాబాద్ లో హైఅలర్ట్ కొనసాగించాలని నిఘా, హోం శాఖ అధికారుల నుంచి హెచ్చరికలు అందాయి.
ఉత్సవాల సందడితో పాటు హైదరాబాద్ లో రక్షణ శాఖకు సంబంధించిన కీలక ప్రదేశాలున్నాయి. డీఆర్ డీవో, డీఆర్ డీఎల్, ఎయిర్ ఫోర్స్ అకాడమీ, న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ వంటి వ్యూహాక్మత స్థావరాలున్న నగరం హైదరాబాద్. కాబట్టి వీటికి భద్రత కూడా పెంచాలని కేంద్ర హోం శాఖ సూచించింది.