ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం తాను పదవి చేపట్టిన తరవాత న్యాయపరిజ్ఞానం ఉండాలనుకుంటున్నారేమో కానీ ఎల్ఎల్బీ చదవాలనుకున్నారు. హైదరాబాద్లో ఓ లా కాలేజీలో చేరారు. మూడేళ్లు దాటిపోయింది. కానీ ఆయన పరీక్షలు రాశారా .. పాసయ్యారా అన్న దానిపై స్పష్టత లేదు. కానీ ఇప్పుడు అసలు ఆయనకు డిగ్రీ కూడా లేదని .. మూడేళ్ల లా కోర్సులో ఎలా ప్రవేశం పొందారని టీడీపీ నేతలు ఆరోపణలు ప్రారంభించారు.
టీడీపీ నేతల ఉద్దేశం ప్రకారం ఫేక్ డిగ్రీ సర్టిఫికెట్ పెట్టి ఆయన అడ్మిషన్ పొందారని అనుకోవచ్చు. తెలంగాణ టీడీపీ నేత నర్సిరెడ్డి ఈ వివరాలను బయట పెట్టారు తమ్మినేని సీతారాంకు అకడమిక్ ఇయర్ 2019-20లో ఆయన హాల్ టికెట్ నెంబర్ 1724 1983 1298 కేటాయించారని… అసలు ఆయనకు కోర్సులో చేరడానికి విద్యార్హత ఎక్కడ నుంచి వచ్చిందని ప్రశ్నిస్తున్నారు. ఎల్ఎల్బీ 3సంవత్సరాల కోర్స్ చదవాలంటే కచ్చితంగా డిగ్రీ పాసై ఉండాలి. లేదా డిగ్రీకి సమానమైన అర్హత కలిగిన కోర్స్ పూర్తి చేసినవారు మాత్రమే ఎల్ఎల్బి 3 సంవత్సరాల కోర్స్ పూర్తి చేయడానికి అర్హులన్నారు.
సీతారాం డిగ్రీని మధ్యలోనే ఆపేసినట్లుగా ఎన్నికల అఫిడవిట్లో స్పష్టంగా రాశారు. 2019 సాధారణ ఎన్నికల అఫిడవిట్లో డిగ్రీ డిస్ కంటిన్యూడ్ గా ప్రకటించిన తమ్మినేని .. అదే సంవత్సరం ఎల్ఎల్బీ 3సంవత్సరాల కోర్సులో అడ్మిషన్ పొందడం ఎలా సాధ్యమైందని ప్రశ్నిస్తున్నారు. దీనిపై అత్యున్నతస్థాయి విచారణ జరిపి ఇలాంటి అక్రమాలేం చేశారో తేల్చాలని అంటున్నారు. దీనిపై స్పీకర్ తమ్మినేని సీతారాం స్పందిస్తారో లేదో కానీ ముందు ముందు ఈ అంశం దుమారం రేపే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.