తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసు తవ్వేకొద్దీ లోతులకు వెళ్లిపోతోంది. వేల ఫోన్లు ట్యాపింగ్ చేసినట్లుగా సీడీఆర్ ఆధారాలు లభ్యమవుతున్నాయి. వీలైనంత మంది స్టేట్మెంట్లను పోలీసులు నమోదు చేస్తున్నారు. ఇలా ట్యాపింగ్ చేసిన నెంబర్లలో న్యాయమూర్తులు, సినీ తారలవి కూడా ఉండటంతో దర్యాప్తు చేస్తున్న అధికారులు కూడా అవాక్కవుతున్నారు.
తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ట్యాపింగ్ జరుగుతోందన్న ఆరోపణలు ఉన్నాయి. అయితే ఇప్పటి వరకూ2018 నుంచి ఫోన్ ట్యాప్ చేస్తున్న సీడీఆర్లు లభించాయి. ట్యాపింగ్ ఆధారాలన్నీ ధ్వంసం చేశామని అనుకున్నారు కానీ.. అధికారిక ట్యాపింగ్ కోసం పంపిన సీడీఆర్లు మాత్రం ధ్వంసం చేయలేకపోయారు. ఇదంతా అధికారిక ట్యాపింగ్ గురించే. అనధికారికంగా చేసిన ట్యాపింగ్ విషయంలో మాత్రం వారు ఇప్పటికీ సేఫ్గానే ఉన్నారని భావిస్తున్నారు.
ఈ ట్యాపింగ్ కేసు వ్యవహారం రాష్ట్ర పోలీసులతో తేలదని…సీబీఐకి ఇవ్వాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు . బీజేపీకి ఇస్తే అది కోల్డ్ స్టోరేజీకి వెళ్లినట్లేనని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ఇప్పుడు అధికారికంగా అయినా.. మొత్తం మావోయిస్టుల పేరుతో ప్రముఖులపై నిఘా పెట్టినట్లుగా పోలీసులు నిరూపించాల్సి ఉంది.