తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు.. తెలంగాణలో ఉన్న పదిహేడు పార్లమెంట్ సీట్లలో… పదహారు తమకు వస్తాయని చెబుతున్నారు. అది మీడియాకు మాత్రమే కానీ అంతర్గత విశ్లేషణల్లో.. మూడు సీట్లు తగ్గవచ్చని… అంచనాలు వేసుకుంటున్నారు. తెలంగాణలో మొదటి విడతలోనే పార్లమెంటు ఎన్నికలు జరిగాయి. ఎన్నికలకు ముగిసిన తర్వాత కాస్త రిలాక్స్ అయిన టీఆర్ఎస్ నేతలు ఫలితాలపై ఇప్పుడే విశ్లేషణలు ప్రారంభించారు.
అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు వార్ వన్ సైడ్ గా ఉన్నా పార్లమెంటు ఎన్నికల్లో మాత్రం పలు పార్లమెంటు స్థానాల్లో హోరాహోరి పోరు తప్పలేదు. ముఖ్యంగా నిజామాబాద్, కరీనంగర్ , మల్కాజ్ గిరి, సికింద్రాబాద్ , భువనగిరి, నల్గొండ, ఖమ్మం, స్థానాల్లో టీఆర్ఎస్ కు గట్టిపోటీ ఎదురయింది. ఎన్నికల ముందు ఈ స్థానాల్లో భారీ మెజార్టీలు వస్తాయని టీఆర్ఎస్ నేతలు భావించినా కౌంటింగ్ సమయం దగ్గర పడుతున్నకొద్దీ వారిలో గెలిస్తే చాలు అన్న భావనకు వచ్చారు. చేవెళ్ల, మల్కాజ్ గిరి, నల్గొండ, భువనగిరి, ఖమ్మం సీట్లలో కాంగ్రెస్తో ముఖాముఖిగా పోలింగ్ జరిగింది. కాంగ్రెస్ నేతలు కూడా ఈ స్థానాల్లో గెలుస్తామన్న ధీమాగా ఉన్నారు.
చేవెళ్ల నుంచి టీఆర్ఎస్ తరపున మొదటి సారి ఎన్నికల్లో పోటీ చేసిన రంజిత్ రెడ్డి గెలుపు పై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. స్థానికేతరుడన్న ఫీలింగ్ రావడంతో గెలుపు కష్టమన్న భావనలో పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు. కొండా విశ్వేశ్వర్ రెడ్డికే అక్కడ మొగ్గు ఉందన్నది..టీఆర్ఎస్లోనూ వినిపిస్తున్న మాట. ఇక సికింద్రాబాద్ , నిజామాబాద్, కరీంనగర్, మహబూబూబ్ నగర్, ఆదిలాబాద్ స్థానాల్లో బీజేపీ , టీఆర్ఎస్ లు ముఖాముఖీగా పోటీ పడ్డాయి. నిజమాబాద్, కరీంనగర్ లో బిజెపికి భారీగా ఓట్లు పోల్ అయ్యాయన్న సమాచారంతో టీఆర్ఎస్ నేతలు డైలమాలో పడ్డారు. ఈ రెండు నియోజక వర్గాల్లో భారీ మెజార్టీ వస్తుందని ముందు భావించినా పోలింగ్ తర్వాత పరిస్థితి తారుమారైనట్టు గులాబీ వర్గాలే చెబుతున్నాయి. ఖమ్మం లో గెలిస్తే చాలనుకుంటున్నారు.
పోలింగ్ పూర్తయిన తర్వాత ఇంటిలిజెన్స్ తో పాటు వివిధ ప్రైవేటు సంస్థలతో సర్వేలు కూడా టీఆర్ఎస్ అధినేత చేయించినట్లు ప్రచారం జరుగుతోంది. సికింద్రాబా, చేవెళ్ల, భువనగిరి నియోజకవర్గాల్లో .. రెండు చోట్ల కాంగ్రెస్ గెలుస్తుందనే.. నివేదికలు వచ్చినట్లు టీఆర్ఎస్ వర్గాలుచెబుతున్నాయి. ఇప్పటికి.. బయటకు పదహారు స్థానాల్లో గెలుస్తామని చెబుతున్నప్పటికి.. సారు.. కారు… తర్వాత 12 లేదా 13కి ఫిక్సవ్వాల్సిన పరిస్థితి రావొచ్చని.. టీఆర్ఎస్ నేతల అంచనా.. !