ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో అమరావతిలో జరగాల్సిన తెలుగు సినిమా ప్రతినిధులు సమావేశం వాయిదా పడింది. నిర్మాతలు, దర్శకులు, నటులు, “మా” ప్రతినిధులతో ఆదివారం సాయంత్రం సిఎం క్యాంప్ కార్యాలయంలో జరగాల్సిన భేటీ వాయిదా పడినట్లుగా మీడియాకు సమాచారం అందింది. భేటీకి రావాల్సిన వారిలో ఎక్కువ మంది షూటింగ్ ల రీత్యా ఇతర ప్రాంతాల్లో ఉండడంతో సమావేశం వాయిదా వేయాలని టాలీవుడ్ ప్రతినిధులు కోరారు. సినిమా రంగంలోని పలు విభాగాల్లోని ముఖ్యమైన వారు అందుబాటులో లేకపోవడంతో మీటింగ్ రద్దు చేస్తున్నట్లుగా తెలిపారు.
షెడ్యూల్ ప్రకారం ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు పవన్ కల్యాణ్ ఆధ్వర్యంలో సినీ ప్రముఖులు చంద్రబాబుతో భేటీ కావాల్సి ఉంది. ఇప్పటికే ఓ లిస్ట్ తయారు చేసుకుని అందరూ రెడీ అయ్యారు. అయితే ఎందుకు హఠాత్తుగా వాయిదా పడిందన్నది మాత్రం టాలీవుడ్ పెద్దలకే తెలియాలి. ప్రభుత్వం వైపు నుంచి సమయం లేదని మరోసారి కలుద్దామని చెప్పారన్న ప్రచారం జరుగుతోంది. లేకపోతే చంద్రబాబు మీటింగ్ ను చివరి నిమిషంలో.. మాకు షూటింగులు ఉన్నాయని పోస్టు పోన్ చేసుకునేంత సీన్ ఉండదని భావిస్తున్నారు.
ప్రభుత్వమే అపాయింట్ మెంట్ ఇచ్చి క్యాన్సిల్ చేసిందని నింద లేకుండా.. ఆ పేరుతో తమ మీదే వేసుకున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది. మరో వైపు చాలా మంది ఇండస్ట్రీ పెద్దలు సమావేశానికి చివరి క్షణంలో హ్యాండివ్వడంతో వాయిదా పడిందన్న ప్రచారం జరుగుతోంది. ఈ విషయంలో పవన్ కల్యాణ్ ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.