అమెరికా సుప్రీంకోర్టు నుండి ఎదురుదెబ్బ తగిలిన కొద్ది గంటల్లోనే, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్ని దేశాల నుండి దిగుమతి అయ్యే వస్తువులపై 10 శాతం మేర కొత్త గ్లోబల్ టారిఫ్లను విధిస్తూ కీలక ఉత్తర్వులపై సంతకం చేశారు. గతంలో అత్యవసర అధికారాల కింద ట్రంప్ విధించిన భారీ సుంకాలను సుప్రీంకోర్టు చట్టవిరుద్ధమని కొట్టివేసింది. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ట్రంప్, కోర్టు తీర్పును అత్యంత నిరాశాజనకం అని అభివర్ణిస్తూనే, ప్రత్యామ్నాయ చట్టాల ద్వారా తన వాణిజ్య విధానాలను ముందుకు తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు.
ఈ కొత్త 10 శాతం టారిఫ్లు ట్రేడ్ యాక్ట్ 1974 లోని సెక్షన్ 122 కింద విధించారు. సాధారణంగా వసూలు చేసే సుంకాలకు ఇవి అదనంగా ఉంటాయి. ఫిబ్రవరి 24, 2026 నుండి అమలులోకి రానున్న ఈ పన్నులు ప్రాథమికంగా 150 రోజుల పాటు అమల్లో ఉంటాయని వైట్ హౌస్ వెల్లడించింది. విదేశీ దేశాలు అమెరికాను దోచుకోకుండా అడ్డుకోవడమే తన లక్ష్యమని, సుప్రీంకోర్టు అడ్డుకున్నప్పటికీ దేశ ఆర్థిక ప్రయోజనాల కోసం తాము వెనక్కి తగ్గబోమని ట్రంప్ స్పష్టం చేశారు.
సుప్రీంకోర్టు తీర్పుతో భారతీయ వస్తువులపై ఉన్న సుంకాలలో కూడా మార్పులు చోటుచేసుకున్నాయి. గతంలో కొన్ని భారతీయ ఉత్పత్తులపై ఉన్న 25-50 శాతం అధిక సుంకాలు కోర్టు తీర్పుతో రద్దు కాగా, తాజా ఉత్తర్వుల ప్రకారం అవి ఇప్పుడు 10 శాతానికి పరిమితం కానున్నాయి. ఇది భారతీయ ఎగుమతిదారులకు కొంత ఊరటనిచ్చే అంశం అయినప్పటికీ, అమెరికాతో కుదిరిన పాత వాణిజ్య ఒప్పందాల కంటే ఈ కొత్త గ్లోబల్ టారిఫ్ అదనపు భారాన్ని పెంచే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.