తుని రైలు దహనం ఘటన కేసులపై అప్పీల్కు వెళ్లాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. కాపు ఉద్యమకారులపై కేసులు కొట్టేస్తూ ఇచ్చిన తీర్పు పై అప్పీల్ కి వెళ్లాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేింది. హైకోర్టులో అప్పీల్ చెయ్యాలని పిపిని ఆదేశిస్తూ హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే కాపు రిజర్వేషన్ల పేరుతో ముద్రగడ తుని .. మామిడి తోటల్లో సభ పెట్టారు. ఎక్కడ నుంచి వచ్చారో కానీ గొడవలు చేసి ప్రయాణికులతో వెళ్తున్న రైలును ప్లాన్ ప్రకారం తగులబెట్టించారు. పోలీసులను, వ్యక్తిగత ఆస్తులనూ వదల్లేదు. ఎంత విధ్వంసం చేయాలో అంతా చేశారు. ఆ కేసులను వైసీపీ ప్రభుత్వం రాగానే ఉపసంహరించుకుంది. రైల్వే పోలీసులు పెట్టిన కేసును కోర్టు కొట్టి వేసింది. ఎందుకంటే ఒక్క సాక్ష్యం కూడా కోర్టుకు సమర్పించలేదు.
కళ్ల ముందే అన్ని సాక్ష్యాలున్నాయి . . ముద్రగడ పద్మనాభం ఇచ్చిన పిలుపులు కూడా ఉన్నాయి కదా.. వైసీపీ నేతల ప్రత్యక్షంగా ఇచ్చిన రెచ్చగొట్టుడు ప్రకటనలు ఉన్నాయి. కానీ ఒక్కటంటే ఒక్క సాక్ష్యం కూడా కోర్టు ముందు ప్రవేశ పెట్టలేదు. ఐదేళ్లు కేసును సాగదీసి ఒక్క సాక్షిని మాత్రమే ప్రవేశ పెట్టారని ఒక్క సాక్ష్యం కూడా చూపించలేదని మండిపడి ముగ్గురు రైల్వే ఉన్నతాధికారులపై చర్యలు తీసుకోవాలని కోర్టు ఆదేశించింది. 41 మందిపై పెట్టిన కేసుల్ని అక్రమ కేసులుగా పరిగణిస్తూ విజయవాడ రైల్వే కోర్టు న్యాయమూర్తి తీర్పు చెప్పేశారు.
ఈ కేసులో ప్రభుత్వం ఇప్పుడు ఆధారాలు చూపించి పై కోర్టులో అప్పీల్ చేయబోతున్నారు. ఈ కేసులో ప్రదానంగా ముద్రగడ పద్మనాభం, దాడిశెట్టి రాజా, కామన ప్రభాకరరావు, వంటి వారు ఉన్నారు. ప్రభుత్వం నిందితుల్ని వదిలేయాలనుకుంటే.. సాక్ష్యాలు కోర్టుల్లో పెట్టనీయదు. కానీ చట్టాన్ని ఎల్లకాలం మోసం చేయలేరుగా.