ఇండియన్ క్రికెట్లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇద్దరూ గొప్ప ఆటగాళ్లు. వీరిద్దరూ తమ ఆటతీరు, నాయకత్వం, వ్యక్తిగత రికార్డులతో క్రికెట్కు కొత్త గ్లామర్ తీసుకొచ్చారు. ఎన్నో అద్భుతమైన క్షణాలను అభిమానులకు అందించారు. ఇలాంటి స్టార్ ఆటగాళ్లు ఇద్దరూ ఒకేసారి టెస్ట్కి గుడ్బై చెప్పిన తర్వాత, మ్యాచ్ గ్లామర్ పై దాని ప్రభావం తప్పనిసరిగా కనిపిస్తుంది. స్టాండ్స్లో కూడా దాని ప్రభావం కనిపించవచ్చు.
అయితే కాలం మారుతూ ఉంటుంది. ప్రతి జనరేషన్లో కొత్త స్టార్స్ పుట్టుకొస్తారు. సచిన్, సెహ్వాగ్ తర్వాత యువరాజ్, ధోని మెరిశారు. వారి తర్వాత రోహిత్, విరాట్ వెలుగులోకి వచ్చారు. ఇప్పుడు మరో జనరేషన్ స్టార్స్ ఎదగాల్సిన సమయం ఇది.
ప్రస్తుతం చాలా మంది యువ ఆటగాళ్లు స్టార్స్గా మారడానికి సిద్ధంగా ఉన్నారు. శుభ్మన్ గిల్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడు. అతను క్లాస్ ఆటగాడు. ఒత్తిడిలోనూ నిలబడగలడు. యశస్వి జైస్వాల్ దూకుడుగా ఆడే ఓపెనర్. అతనిలో క్లాస్, మాస్ రెండూ కనిపిస్తాయి. రిషభ్ పంత్ మ్యాచ్ను ఒక్క సెషన్లోనే మార్చగల సామర్థ్యం ఉన్న ఆటగాడు. అతని ఆటని అభిమానులు ఆస్వాదిస్తారు.
సీనియర్ కోటాలో వరల్డ్ క్లాస్ బౌలర్ బుమ్రా జట్టులో ఉన్నాడు. సాయి సుదర్శన్, నితీష్ రెడ్డి, ప్రసిద్ కృష్ణ లాంటి యువ ఆటగాళ్ళు కూడా అదృష్టాన్ని పరీక్షించుకోతున్నారు. టీమిండియాలో టాలెంట్కి కొదవలేదు. కానీ నిలకడగా ఆడి అభిమానుల మనసుల్లో స్థానం సంపాదించుకోవడం ముఖ్యం.
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లేకుండా ఇంగ్లండ్లో ఐదు టెస్టుల సిరీస్కి భారత జట్టు సిద్ధమవుతోంది. జూన్ 20న తొలి టెస్ట్ ప్రారంభం కానుంది. ఇంగ్లండ్లో టెస్ట్ సిరీస్ అంటే ప్రతిష్టాత్మకం. సీనియర్లు, జూనియర్లు సమతూకంగా ఉన్న ఈ జట్టుకి ఇది నిజంగా ఒక రియల్ టెస్ట్. ఈ సిరీస్ టీమిండియాకు కొత్త హీరోలను నిర్ణయించే సిరీస్ అవుతుంది.