‘విరాటపాలెం’ వెబ్ సిరీస్ వెరైటీగా ప్రచారంలోకి వచ్చింది. జీ5 లో తయారైన ఈ వెబ్ సిరీస్ పై మరో ఓటీటీ సంస్థ ఈటీవీ విన్ న్యాయ పోరాటానికి దిగింది. తమ సంస్థలో రెడీ అవుతున్న ‘కానిస్టేబుల్ కనకనం’ అనే వెబ్ సిరీస్ కథతోనే జీ5 సిరీస్ తీశారని ప్రెస్మీట్ పెట్టి మరీ ఆరోపించింది. విరాటపాలెం ట్రైలర్ లో కనిపించిన ఆసక్తికంటే ఈటీవీ విన్ ఈ కథ గురించి చెప్పిన విధానం చాలా క్యూరియాసిటీ పెంచింది. మరి అంత గొప్ప కథ ఏముంది? ఈ మిస్టరీ థ్రిల్లర్ ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతిని పంచింది?
1980లో విరాటపాలెం గ్రామంలో ఒక పెళ్లిలో మొదలైన కథ ఇది. పెళ్లిపీటల మీద ఉన్న వధువు ఒక్కసారిగా రక్తం కక్కుకుంటూ చనిపోతుంది. ఇదే తరహాలో మరికొన్ని ఘటనలు జరుగుతాయి. దీంతో ఊర్లో భయానక పరిస్థితులు అలముకుంటాయి. గ్రామానికి శాపం తగిలిందని ప్రజలు నమ్ముతారు. ఇక అప్పటి నుంచీ గ్రామంలో ఒక్క వివాహం కూడా జరగదు. కొందరు ఆస్తులు అమ్ముకొని గ్రామం విడిచిపెట్టి పోతుంటారు. క్రమంగా ఆ ఊరు కళాహీనమైపోతుంటుంది. ఇదే సమయంలో ఆ ఊరికి పోలీస్ కానిస్టేబుల్గా మీనా (అభిజ్ఞ వూతలూరు) వస్తుంది. ఆ ఊర్లో జరిగిన ఘటనలపై మీనాకు అనుమానం వస్తుంది. మరి అసలు నిజానికి చేధించడానికి మీనా ఎలాంటి రిస్క్ చేసింది? నిజంగా ఆ ఊరికి శాపం తగిలిందా? నవ వధువుల చావులకు అసలు కారణం ఏమిటి? ఇదంతా మిగతా కథ.
కొన్ని వెబ్ సిరీస్లు చూస్తున్నప్పుడు.. అసలు ఏ యాంగిల్లో దీన్ని వెబ్ సిరీస్ అంటారనే ప్రశ్న తొలిచేస్తుంది. విరాటపాలెం కూడా ఆ కోవలోకే వస్తుంది. ఈ సిరీస్ దర్శకుడు పోలూరు కృష్ణ గతంలో అదే జీ5కి ‘రెక్కీ’ అనే వెబ్ సిరీస్ చేశాడు. మంచి సిరీస్ అది. విరాటపాలెం చూసిన తర్వాత అసలు రెక్కీ తీసింది ఇతగాడేనా? అనే అనుమానం వస్తుంది. ఎందుకంటే విరాటపాలెం అంత పేలవంగా ఉంది. అసలు వెబ్ సిరీస్కి పనికొచ్చే పాయింట్ కాదిది. ‘క్రైమ్ పెట్రోల్’లాంటి టీవీ సీరియల్స్లో ఒక ఎపిసోడ్కి పనికొచ్చే చిన్న పాయింట్ పట్టుకొని వెబ్ సిరీస్ అని ఏడు ఎపిసోడ్లు తీశారు. డైలీ సీరియల్స్ కంటే అధ్వానమైన రైటింగ్, మేకింగ్తో తయారైన సిరీస్.
కథలో బలం లేదు. సస్పెన్స్ని కొనసాగించడానికి సరిపడా సరుకు లేదు. అమ్మవారి శాపం అంటారు. ఎందుకో చెప్పరు. కనీసం ఒక్క సీన్ కూడా వెయ్యరు. కేవలం డైలాగులతో నమ్మించే ప్రయత్నం చేస్తారు. చావులపై క్లారిటీ ఉండదు. ఆ చావులు ఎలాంటి ఇంపాక్ట్ ని క్రియేట్ చేయవు. ఊర్లో పెళ్లి జరిగితే పెళ్లికూతురు చనిపోతుంది .. ఇది పాయింట్. ఈ పాయింట్ కన్వే చేయడానికి మూడు ఎపిసోడ్లు తీసుకున్నారు. అంతవరకూ డ్రామా మరో అంకం వైపు జరగదు.
వెబ్ సిరీస్ కథ రాసే గ్రామర్ వేరు. ఒక పాత్రని ప్రవేశపెట్టిన తర్వాత దాని పుట్టుపూర్వోత్తరాలు రాయాలి. అన్ని పాత్రలకు కాకపోయినా కనీసం ప్రధాన పాత్రలకైనా క్యారెక్టర్ ఆర్క్ ఉండాలి. అందులో నుంచే డ్రామా పుడుతుంది. విరాటపాలెంలో అలాంటి ఒక్క పాత్ర కూడా కనిపించదు. కనీసం కానిస్టేబుల్గా వచ్చిన మీనా పాత్రని కూడా బలంగా తీర్చిదిద్దలేదు. కానిస్టేబుల్ మీనా విచారణ కూడా పరమ బేసిక్గా ఉంటుంది. ఆమె పెళ్లి రెడీకి అయిపోయిన విధానం చూస్తే తనది విధినిర్వహణ అనుకోవాలో.. క్యారెక్టర్ అంటే లెక్కనితనమో అర్థం కాదు. ఇక సస్పెన్స్ రివీల్ చేసిన విధానం కూడా టీవీ సీరియల్ కంటే డల్.
మీనా పాత్రని బలంగా రాసుకోలేదు. ఆమె నటన కూడా అలానే ఉంది. ఒకటే ఎక్స్ప్రెషన్ కొనసాగించిన ఫీలింగ్ కలుగుతుంది. ప్రెసిడెంట్గా రామరాజు కనిపించారు కానీ ప్రభావం చూపలేదు. మిగతా పాత్రలు కూడా సోసోగానే ఉంటాయి. టెక్నికల్గా సిరీస్ మెప్పించలేకపోయింది. కెమెరా పనితనం, సౌండ్ క్వాలిటీ నాసిరకంగా వున్నాయి. ఇలాంటి కంటెంట్కి ఎడిటర్తో పని లేదు. ఎందుకంటే ఎడిట్ చేయడానికి ఏమీ లేదక్కడ. ఏడు నిమిషాలు వచ్చే ఓ పాయింట్ పట్టుకొని ఏడు ఎపిసోడ్లు లాగారు. ఎపిసోడ్ 20 నిమిషాలే ఉంటుంది కానీ 40 నిమిషాలు చూసిన ఫీలింగ్ కలిగిస్తుంది. ఒక క్యారెక్టర్ టీ కొట్టులో కూర్చొని టీ అందుకోవడానికి దాదాపు 10 సెకన్లు పడుతుంది. ఆ తంతు చూస్తున్నప్పుడు అదేదో సినిమాలో సప్తగిరి ‘ఓడియమ్మ ల్యాగు’ డైలాగ్ గుర్తుకు వస్తుంది.
అన్నట్టు.. ఈటీవిన్ వారికి ఓ సూచన. ఈ కథని కాపీ కొట్టారని ఆరోపిస్తూ కోర్టుకు వెళ్లారు. న్యాయపోరాటం సంగతి ఏమో కానీ.. ఈపాటి కథని చెప్పడానికి వెబ్ సిరీస్ అక్కరలేదు. దీనికంటే ఈటీవీలో వచ్చే ‘నేరాలు ఘోరాలు’ ఎపిసోడ్లు కొన్ని ఆసక్తికరంగా ఉంటాయి. అయితే ఈవిన్ తమ సిరీస్లో భారీ స్థాయి గ్రాఫిక్స్, సిజీ వర్క్ వుందని చెబుతోంది. అంతపాటి వర్క్ ఉందంటే బహుశా అది ఈ కథ కాకపోవచ్చు.