వాల్ స్ట్రీట్ జర్నల్ అనే అమెరికా పత్రిక ఒకటి పాకిస్తాన్ వ్యవహారశైలిని తప్పు పడుతూ ఒక కధనం ప్రచురించింది. భారత్ ప్రధాని పాకిస్తాన్ కి స్నేహహస్తం అందిస్తుంటే దానిని అందుకొనే ప్రయత్నం చేయకుండా భారత్ పట్ల పాక్ చాలా అనుచితంగా ప్రవర్తిస్తోందని విమర్శించింది. యూరీ దాడుల తరువాత కూడా భారత్ ప్రధాని పాక్ తో యుద్ధం చేసే ఆలోచన చేయకుండా చాలా సంయమనంగా వ్యవహరిస్తున్నారని మెచ్చుకొంది. ఒకవేళ పాక్ ఇదే విధంగా పదేపదే భారత్ ని రెచ్చగొడుతుంటే భారత్ ఎప్పటికీ సహనంగా ఉంటుందని భావించవద్దని హెచ్చరించింది.
భారత్ సహనాన్ని అసమర్ధతగా భావించి రెచ్చిపోతే దాని వలన పాకిస్తేనే తీవ్రంగా నష్టపోక తప్పదని హెచ్చరించింది. పాకిస్తాన్ తమతో చాలా అనుచితంగా వ్యవహరిస్తున్నప్పటికీ భారత్ మాత్రం పాక్ పట్ల చాలా పద్దతిగా వ్యవహరిస్తోందని అభిప్రాయపడింది. భారత్ వ్యూహాత్మకంగానే మౌనం వహిస్తోందని కానీ అది పాకిస్తాన్ కి బుద్ధి చెప్పడానికి అనేక చర్యలు చేపడుతోందని పేర్కొంది. మోడీ ప్రభుత్వం చేపడుతున్న చర్యల వలన అంతర్జాతీయ సమాజంలో పాకిస్తాన్ ఒంటరి అయ్యే ప్రమాదం ఉందని, కనుక అటువంటి పరిస్థితి రాకమునుపే పాకిస్తాన్ మేల్కొని భారత్ అందిస్తున్న స్నేహ హస్తం అందుకొంటే దానికే మంచిదని అభిప్రాయం వ్యక్తం చేసింది.
వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రపంచ ప్రసిద్ది చెందిన పత్రికే కావచ్చు…ఆ కధనంలో వ్రాసిన విషయాలన్నీ అక్షర సత్యాలే కావచ్చు. కానీ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా అంతటివాడు పదేపదే హెచ్చరిస్తున్నా పాక్ తన కుక్క తోక వంకర బుద్ధిని మార్చుకోలేదు. అటువంటిది ఒక పత్రిక హెచ్చరికలని అది ఖాతరు చేస్తుందని ఆశించలేము.
ఆశించలేమని పాక్ సైనికాధికారులు తమ మాటలతో నిరూపించి చూపిస్తున్నారు. వారు భారత్ తో యుద్దానికి చాలా ఉవ్విళ్ళూరుతున్నారు. భారత్ పై దాడులు చేస్తామని, అణుబాంబులు కురిపించి భారత్ ని నేలమట్టం చేస్తామని ప్రగల్భాలు పలుకుతూనే ఉన్నారు. అటువంటి మాటలు ఏ హిజ్బుల్ ఉగ్రవాదో లేదా ఐసిస్ ఉగ్రవాదో అంటే వాటిని పట్టించుకోనవసరం లేదు. కానీ సాక్షాత్ ఆ దేశ సైన్యాధ్యక్షుడు, ఆర్మీ అధికార ప్రతినిధి, సైనికాధికారులు అనడాన్ని అంత తేలికగా కొట్టిపారేయలేము. భారత్ పై వారు ఎంత పగ ప్రతీకారాలతో రగిలిపోతున్నారో వారిలో ఎంత యుద్ద కాంక్ష ఉందో వారి మాటలలోనే స్పష్టంగా ప్రతిధ్వనిస్తోంది.
కానీ భారత్ తో తమ దేశం స్నేహమే కోరుకొంటోందని భారత్ అందుకు ఇష్టపడటం లేదని పాక్ ప్రధాని మవాజ్ షరీఫ్ ఐక్యరాజ్యసమితిలో నంగనాచి కబుర్లు చెపుతుంటారు. ఇటువంటి వక్రమైన బుద్ధి, ఆలోచనలు ఉన్న పాకిస్తాన్ కి ఎవరు ఎన్ని నీతులు చెపితే మాత్రం ఏమి ప్రయోజనం? కుక్క తోక వంకరని ఎవరూ సరి చేయలేరు. అలాగే భ్రష్టు పట్టిపోయిన పాకిస్తాన్ బుద్ధిని కూడా!