టీ న్యూస్ చానల్ యాంకర్ స్వేచ్ఛ మృతి కేసులో పూర్ణ చంద్రరావు అనే వ్యక్తి పేరు ఎక్కువగా వినిపిస్తోంది. ఆ వ్యక్తినే స్వేచ్ఛతో గత నాలుగైదేళ్లుగా సహజీవనం చేస్తున్నారు. కానీ పెళ్లి చేసుకోలేదు. ఇరువురి మధ్య ఇటీవల సరిపడటం లేదని ఆమె తండ్రి చెప్పారు. పూర్ణచంద్రరావుతో ఉండలేనని చెప్పినట్లుగా స్వేచ్ఛ తండ్రి చెబుతున్నారు. తన కుమార్తె మరణం విషయంలో అతనినే అనుమానిస్తూ .. స్వేచ్ఛ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
స్వేచ్ఛ మృతి విషయం బయటకు తెలిసిన తర్వాత పూర్ణచంద్రరావు కనిపించడం మానేశాడు. ఫోన్లు స్విచ్ఛాఫ్ చేసుకున్నాడు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. స్వేచ్ఛ ఫోన్ స్వాధీనం చేసుకున్న పోలీసులు ఆధారాల కోసం విశ్లేషిస్తున్నారు. ఈ పూర్ణచంద్రరావు టీ న్యూస్ చానల్లోనే ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్ గా పని చేస్తున్నట్లుగా చెబుతున్నారు. సంతోష్ రావుకు సన్నిహితుడని ఆయన సిఫారసుతోనే ఉద్యోగం సంపాదించుకున్నారని అంటారు. అలాగే బీఆర్ఎస్ కార్యక్రమాల్లోనూ చురుకుగా పాల్గొంటారు.
పూర్ణచంద్రరావుకు కూడా గతంలో వివాహం అయినట్లుగా చెబుతున్నారు. ఐదేళ్ల కిందట భర్తతో వివాదాల కారణంగా ఒంటరిగా ఉంటున్న స్వేచ్ఛ .. పూర్ణ చంద్రరావు చేసిన మోసాన్ని భరించలేకపోయిందని అంటున్నారు. పూర్ణచంద్రరరావు బీఆర్ఎస్ నేతలతో దిగిన ఫోటోలు కూడా వైరల్ కావడంతో రాజకీయ అంశమయ్యేలా మారింది. పూర్ణచంద్రరావును పోలీసులు పట్టుకున్న తర్వాత కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. పోస్టుమార్టం రిపోర్టులో మృతి కారణం వెల్లడయ్యే అవకాశం ఉంది.