తెదేపాకి కంచుకోట వంటి కృష్ణాజిల్లాలో ఆ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. అందుకు అతి ధీమాయే కారణం కావడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. తెదేపా కాస్త ఏమరుపాటుగా ఉన్నందున దానికి దక్కవలసిన పెడన మున్సిపల్ కౌన్సిల్ చైర్మన్ పదవిని వైకాపా ఎగురేసుకు వెళ్ళిపోయింది. పెడన మున్సిపల్ కౌన్సిల్లో రెండు పార్టీలకి చెరో 11మంది కౌన్సిలర్లు ఉన్నారు. కానీ తెదేపా ఎమ్మెల్యే కాగిత వెంకట్రావు ఎక్స్ అఫిషియో సభ్యుడిగా ఉన్నందున తెదేపాకే అధ్యక్ష పీఠం దక్కాలి. ఖచ్చితంగా తమకే దక్కుతుందని తెదేపా చాలా ఆత్మవిశ్వాసంతో ఉంది. కానీ తెదేపా కౌన్సిలర్ స్రవంతి ఎవరూ ఊహించని విధంగా వైకాపా చైర్మన్ అభ్యర్ధి బండారు ఆనంద్ ప్రసాద్ కి ఓటేయడంతో అయన అనూహ్యంగా గెలుపొందారు. ఇది చూసి తెదేపా షాక్ అయ్యింది. అసలు తమ కౌన్సిలర్ ఒకరు వైకాపాకి ఓటేస్తారని వారు ఊహించకపోవడం చేతనే వారు తమ పార్టీ గెలుపు ఖాయం అనే ధీమాతో వ్యవహరించారు. ఆ ధీమాయే తెదేపా కొంప ముంచింది. పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించినందుకు స్రవంతిపై తెదేపా క్రమశిక్షణ చర్యలు తీసుకోవచ్చు. కానీ జరిగిన నష్టాన్ని సరిదిద్దలేరు. ఆమె కూడా వైకాపాలో చేరిపోతే తెదేపాకి ఒక కౌన్సిలర్ తగ్గిపోతారు. వైకాపా మరి కొంత బలపడుతుంది. మరి తెదేపా ఏవిధంగా వ్యవహరిస్తుందో వేచి చూడాలి.
పెడన మండల పరిషత్ వైకాపా చేతిలోనే ఉంది. దానిలో వైకాపాకి ఆధిక్యత ఉన్నందున వైకాపాకి చెందిన అచ్యుతరాజు మండల పరిషత్ అధ్యక్షుడిగా ఉన్నారు.