అటు ప్రభుత్వం ఇటు దానికి వంతపాడే ఆర్థిక వేత్తలు సబ్సిడీల రూపంలో చాలా ధనం దుర్వినియోగమై పోతుందని విమర్శించడం వింటూనే వుంటాం. అయితే నిరుపేద మధ్య తరగతి ప్రజలకు ప్రాణాధారంగా వున్న పిడిఎస్(ప్రజా పంపిణీ వ్యవస్థ)ను కోత కోయడం మాత్రం మానవత్వం కాదు. గుర్తింపునిస్తుందని ఆశలు కల్పించిన ఆధార్ చౌకసరుకులతో సహా వివిధ సదుపాయాల కోతకు ఆయుధం కావడం మరింత దారుణం. అయిదేళ్ల నుంచి అస్తవ్యస్తంగా నడుస్తున్న ఆధార్ కార్డుతో అనుసంధానం చేయాలని నిర్ణయించారు. ఇది మంచిది కాదని సాక్షాత్తూ సుప్రీం కోర్టే మందలించినా ప్రభుత్వానికి చెవికెక్కడం లేదు . దాని సమస్యలను గురించి నిపుణులు, ఆర్థిక వేత్తలు, ఆఖరుకు న్యాయస్థానాలు కూడా చెప్పినా యునిక్ ఐడెంటిపికేషన్ (యుఐడి) జారీ చేసిన యుఐడిఎఐ (యునిక్ ఐడెంటిపికేషన్అథారిటీ ఆఫ్ ఇండియా) వినిపించుకోలేదు.
ప్రభుత్వ సదుపాయాలను సబ్సిడీలనన్నిటినీ ఆధార్ కార్డుతో అనుసంధానం చేయడాన్ని సవాలు చేస్తూ 2015 అక్టోబరు15న సుప్రీం కోర్టులో ఒక కేసు దాఖలైంది. ఆధార్ కార్డు తీసుకోవడం వినియోగించడం స్వచ్చందం తప్ప నిర్బంధం కాదని ప్రభుత్వం అప్పుడు వాదించింది. సబ్సిడీలు, ఉపాధి హామీ పథకం,పెన్షన్లు, జనధన్ యోజన, చౌకసరఫరాలకు తప్ప మరే ఇతర సేవలకు దీన్ని ఉపయోగించబోమని హామీఇచ్చింది. ఆధార్ కార్డుదారుల వ్యక్తిగత సమాచారం ఎవరితోనూ పంచుకునే ప్రసక్తిలేదని చెప్పింది. కాని తర్వాత కాలంలో ఆధార్ సమాచారం ఏకంగా సిబిఐతోనే పంచుకోవడానికి సిద్ధమైతే కోర్టే నివారించాల్సి వచ్చింది. అసలు ఇంత పెద్ద జనాభా వున్న దేశంలో అందరికీ గుర్తింపు కార్డుల ఆలోచనే అసహజం. కాని ప్రభుత్వం వాణిజ్య వర్గాల ఒత్తిడి వల్ల అంతర్జాతీయ అనధికారికంగా అన్ని సేవలకు ఆధార్ను కొలబద్దగా తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఒకసారి స్వచ్చందం(ఇష్టపూర్వకం) అని చెప్పిన తర్వాత దాన్ని తప్పనిసరి గుర్తింపుగా ఎలా నిర్ణయిస్తారు? పైగా దేశంలో అందరికీ ఆధార్ కార్డు అందిన పరిస్థితి లేదు. అధికారిక జనాభా లెక్కల ప్రకారం 2015 జులై12 నాటికి భారత దేశ జనాభా 127 కోట్ల పైచిలుకు. ఇది 2016 జులైనాటికి 133 కోట్లకు చేరిందని అంచనా. కాని ప్రభుత్వం చెప్పే ప్రకారం ఇప్పటికి ఇచ్చిన ఆధార్ కార్డుల సంఖ్య 105 కోట్లు మాత్రమే! ఇచ్చామంటున్న వాటిలోనూ చేరినవి,లొసుగులు తీసేస్తే మరెన్ని వడపోయాలో! ఈలెక్కల ప్రకారమే 25 కోట్లమందికి కార్డులే లేవు. వయోజనుల్లో 67శాతం మాత్రమే కార్డులు కలిగివున్నారు.
మరి ఇంత భారీ తేడా వున్నప్పుడు మిగిలిన వారికి ప్రభుత్వ సదుపాయాలు నిరాకరించబడతాయి కదా?
పిడిఎస్ దుకాణాలలో ఆధార్ కార్డు చూపించినంత మాత్రాన వెనువెంటనే అన్ని సదుపాయాలు లభించవు. ఆ తర్వాత లబ్దిదారులు రకరకాల బయోమెట్రిక్ సాధనాలదగ్గర తమ గుర్తింపు నిరూపించుకోవాలి. నిరక్షరాస్యత వెనుకబాటుతనం ఇంకా వీడని ఈ దేశంలో కోట్లమంది గిరిజనం కూడా వున్నారు. చౌక దుకాణాల దగ్గర పాయింట్ ఆప్ సేల్(పివోఎస్) మెషిన్లు బిగిస్తారు. వారి గుర్తింపును తనిఖీ చేయడమే గాక వేలిముద్రలు పరీక్షించి అవి ఆధార్ కార్డుపై వున్నవాటితో సరిపోలేది లేనిది నిర్ణయిస్తారు. అంటే దీనికి అనేక రకాల యంత్రాలు వాటి అనుసంధానం కూడా వుండాలి. పివోఎస్ మిషన్లు, బయో మెట్రిక్ పరికరాలు,ఇంటర్నెట్ కనెక్షన్, రీమోట్ సర్వర్లు, స్థానిక మొబైట్ నెట్వర్క్లు వంటివన్నీ కావాలి. ఇంట్లో ఒకరిద్దరు సభ్యులైనా సరే సరైన ఆధార్ నెంబరు కలిగివుండటమే గాక అది ప్రజా పంపిణీ వ్యవస్థ(పిడిఎస్) డేటాబేస్లో సరిగ్గా నమోదై వుండాలి. అనుభవాన్ని బట్టి చూస్తే ఇదంత సులభంగా అమలయ్యేది కాదు. పిడిఎస్పై విస్త్రత అధ్యయనాలు చేసిన జీన్ డ్రీజ్ బృందం ఈ పద్ధతిని ప్రవేశపెట్టిన రాజస్థాన్,జార్ఖండ్లలో క్షేత్రస్థాయి పరిశీలన జరిపినప్పుడు యాభై నుంచి 60 శాతానికి అటూ ఇటూ మాత్రమే అమలవుతున్నట్టు తేలింది. అది కూడా అనేక లోపాలతో. ప్రజలు ఈ చిక్కుముడుల కారణంగా ప్రజలు పదేపదే ఆ దుకాణాల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిన దురవస్థ! నెలల తరబడి ప్రజలు రేషన్ కోల్పోతున్న పరిస్థితి! అయినా కేంద్రం మొండిగా ఏకపక్షంగా ఆధార్ పాట పాడుతున్నది. దీనివల్ల అవినీతిని అరికట్టవచ్చని చేస్తున్న ప్రచారం కూడా నిజం కాదు.ఎందుకంటే ఈ రెండు రాష్ట్రాలలోనూ సరుకుల మరలింపు భారీగానే జరిగిపోతున్నది.ఏతావాతా ఆధార్ పేరుతో ప్రజల సదుపాయాలు సరుకుల సరఫరా సబ్సిడీలకు ఎగనామం పెట్టే పథకం తప్ప ఇది మరొకటి కాదు. ఇదెంతమాత్రం సరికాదు. మొదటే చెప్పుకున్నట్టు అవినీతి కుబరేలకు దేశాన్ని కట్టబెట్టే పాలకులు పేదలకు ఇచ్చే ఆహారపదార్థాలకు ఆచరణ సాధ్యం గాని ఆధార్ షరతు విధించడం అన్యాయం. వ్యక్తుల భద్రతకే గాక దేశ భద్రతకు కూడా హానికలిగిస్తుందని దేశ దేశాల అనుభవాలు చెబుతున్నాయి. అయినా ప్రభుత్వం పునరాలోచనకు సిద్దపడని కేంద్రంమొన్న సోమవారం(26వ తేదీ) అనుకున్న ప్రకారమే ఆధార్ చట్టం నోటిఫికేషన్ విడుదల చేసింది.
కంటితుడుపుగా యుఐడి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఎవిపాండే, కేంద్ర అటార్జీ జనరల్ ముకుల్ రోహ్తగి ఏవో వివరణలు ఇచ్చారు గాని ఈ విషయంలో సవాళ్లు సమస్యలు అలాగే వున్నాయి. దేశంలో వేల కోట్ల రూపాయాలు నేరుగా రుణాలు తీసుకుని లేదంటే అక్రమ పద్ధతుల ద్వారా ఎగవేసిన ఘరానా బాబులంతా హాయిగా వుంటే ఆహారం వంటి కనీసావసరాల కల్పనకు ఇన్ని పద్మవ్యూహాలు కల్పించడం న్యాయం కాదు.