ప్రభుత్వ వ్యతిరేకులు ముఖ్యంగా పోటీ దారులపై వ్యవస్థలు ఎంత వేగంగా స్పందిస్తాయో మరోసారి నిరూపణ అయింది. గురువారమే ఓ పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీపై రెండేళ్ల జైలుశిక్షను గుజరాత్లోని సూరత్ కోర్టు వేసింది. శుక్రవారమే ఆయనపై లోక్ సభ సెక్రటేరియట్ అనర్హతా వేటు వేసింది. ఆ కోర్టు తీర్పు కాపీ అందిందో మీడియా రిపోర్టులు చూసి వేటు వేశారో తెలియదు కానీ.. ఆ కోర్టు తీర్పుపై అప్పీలుకు వెళ్లడానికి కోర్టే నెల రోజుల సమయం ఇచ్చింది. కానీ లోక్ సభ సెక్రటేరియట్ మాత్రం ఒక్క రోజు కూడా గడువు ఇవ్వకుండా అనర్హతా వేటు వేసేశారు.
రాహుల్ గాంధీ అప్పీల్ కు వెళ్లి ఆ కోర్టు తీర్పుపై స్టే తెచ్చుకుంటారేమోనన్న కంగారులో ఇలా చేసేశారని సహజంగానే విమర్శలు వస్తున్నాయి. రాజకీయ విమర్శల కేసుల్లో రెండేళ్ల జైలు శిక్ష విధించడమే అనూహ్యం అంటే అంతకు మించి వేగంగా రాహుల్ గాంధీని సభ నుంచి గెంటేశారు. నిజానికి రాజకీయాల్లో అత్యంత అవినీతి పరులు, దారుణమైన హత్యలు చేసిన వారు … అంతకు మించి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేవారు ఉన్నారు. వారంతా యథేచ్చగా రాజకీయాలు చేస్తున్నారు. ఏళ్ల తరబడి విచారణ జరుగుతోంది. ఎవరూ అనర్హతా వేటుకు గురికాలేదు.
వారంతా అధికార పార్టీలోనో.. అధికార పార్టీ అండతోనే వ్యవస్థల్ని మేనేజ్ చేసుకుంటూ రాజకీయాలు చేసేస్తున్నారు. కానీ తాను చేసిన కామెంట్లకు జైలు శిక్ష వేస్తారని రాహుల్ గాంధీ కూడా ఊహించి ఉండరు. ప్రజలు ఈ విషయంలో తిరుగుబాటు చేస్తే.. బీజేపీకి అతి పెద్ద ప్రమాదం ముంచుకొస్తోంది. రాహుల్ కు వేసిన శిక్షపై ప్రజలు ఎలా స్పందిస్తారన్నదానిపై రాజకీయాలు ఆధారపడి ఉంటాయి.