కన్నా లక్ష్మినారాయణకు సత్తెనపల్లి అభ్యర్థిత్వాన్ని చంద్రబాబు ఖరారు చేశారు ఇంచార్జిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కన్నా లక్ష్మినారాయణ సత్తెనపల్లిపై దృష్టి పెట్టి టీడీపీలో చేరారు. ఆయన కోరిక మేరకు ఇంచార్జ్ గా నియమించారు. కోడెల శివప్రసాదరావు గత ఎన్నికల్లో అక్కడి నుంచి పోటీ చేసి పరాజయం పాలయ్యారు. తర్వాత ప్రభుత్వ వేధింపుల వల్ల ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన కుమారుడు కోడెల శివరామ్ చురుగ్గా తిరుగుతున్నారు. కానీ చంద్రబాబు.. కన్నా వైపు మొగ్గారు.
సత్తెనపల్లిలో కాపు సామాజికవర్గం నిర్ణయాత్మక శక్తిగా ఉంది. అందుకే రేపల్లెకు చెందిన అంబటి రాంబాబు సత్తెనపల్లిలో పాగా వేశారు. స్థానికేతరుడు కావడంతో ఎక్కువ మంది వైసీపీ నేతలు వ్యతిరేకిస్తున్నారు. కన్నా లక్ష్మినారాయణకు సత్తెనపల్లి నియోజకవర్గంలో విస్తృత పరిచయాలు ఉన్నాయి. జనసేన పొత్తు కూడా ఉండే అవకాశం ఉండటంతో.. సత్తెనపల్లిలో విజయం నల్లేరుపై నడక అవుతుందన్న అంచనాలు ఉన్నాయి.
అయితే ఇప్పుడు కోడెల శివరాంను చంద్రబాబు బుజ్జగించాల్సి ఉంది. ఆయనకు రాజకీయంగా ఎలాంటి అవకాశాలు కల్పిస్తారో చెప్పి.. చురుకుగా పని చేసేలా చూడాల్సి ఉంది. కన్నా లక్ష్మినారాయణకు వ్యతిరేక వర్గమంటూ లేదు. కానీ కోడెలకు చాన్సివ్వకపోతే వారు వ్యతిరేకమవుతారన్న ఆందోళన ఉంది. అయితే కన్నాను ఇంచార్జ్ గా ప్రకటించక ముందే..కోడెల శివరాంతో పార్టీ పెద్దలు మాట్లాడారని చెబుతున్నారు.