ఇంటర్వెల్ తరువాత మళ్ళీ కాంగ్రెస్ ప్రత్యేక పోరాటం

రాష్ట్ర విభజన సమయంలో ఏపికి ప్రత్యేక హోదా ఇస్తామని యూపియే ప్రభుత్వం పార్లమెంటులో నోటి మాటగా హామీ ఇవ్వడం, దానిని అప్పుడు ప్రతిపక్ష స్థానంలో ఉన్న భాజపా గట్టిగా బలపరచడం వెనుక ఉద్దేశ్యం ఏమిటో గత ఎన్నికల సమయంలోనే బయటపడింది. చెట్టు పేరు చెప్పుకొని పళ్ళు అమ్ముకొన్నట్లుగా ప్రత్యేక హోదా పేరు చెప్పుకొని కాంగ్రెస్, భాజపాలు ఓట్లు పిండుకోవాలని ప్రయత్నించాయి.

అలాగే ప్రత్యేక హోదా వలన ఆశించిన ప్రయోజనం ఒకటయితే జరుగుతున్నది మరొకటి. దాని వలన రాష్ట్రంలో వేగంగా పారిశ్రామికాభివృద్ధి జరగాల్సి ఉండగా, నేటికీ ప్రత్యేక హోదా ప్రకటించకపోవడంతో రాష్ట్రంలో కొన ఊపిరితో ఉన్న కాంగ్రెస్ పార్టీ దానిని ‘ఆక్సిజన్’ గా వాడేసుకొంటూ ప్రాణాలతో బ్రతికి బయటపడాలని ప్రయత్నిస్తోంది.

ఈ ‘ప్రత్యేక సమస్య’తో చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి అగ్ని పరీక్షలు పెట్టి, ఆయనను నిత్యం తిట్టిపోయడానికి జగన్మోహన్ రెడ్డి ఇది చాలా ఉపయోగపడుతోంది. ప్రత్యేక హోదా ఇచ్చి ఉండి ఉంటే ఆ రెండు పార్టీలు తమ మనుగడకి వేరే సమస్య కోసం వెతుక్కోవలసి వచ్చేది కానీ ప్రధాని నరేంద్ర మోడి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పుణ్యమాని వాటికి ఆ ఇబ్బంది తప్పింది. అవి ప్రభుత్వంతో పోరాడటానికి చేతిలో మరే సమస్య లేనప్పుడు ‘స్టాండ్ బై’లో ఉన్న ఈ ప్రత్యేక సమస్య అక్కరకు వస్తుంటుంది. ఎవ్వర్ గ్రీన్ సబ్జక్ట్ అయిన దానిపై ఎప్పుడు కావాలంటే అప్పుడు మళ్ళీ ఉద్యమించే వెసులుబాటు ఏర్పడింది.

దీనిని మొదట గుర్తించింది రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీయే. కనుక రాష్ట్రం కోసం కాకపోయినా ఆ పేరు చెప్పుకొని జీవచ్చవంగా మారిన తమ పార్టీకి దీనితో ఊపిరి ఊది బ్రతికించుకొనేందుకు పోరాటం మొదలుపెట్టింది. దాని కోసం గుంటూరు, తిరుపతిలో సభలు పెట్టి హడావుడి చేసింది. దానితో పార్టీని బ్రతికించుకోలేకపోయింది కానీ ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్త సజీవ దహనం అయిపోయాడు. ఆ తరువాత చిన్న బ్రేక్ తీసుకొని వైకాపాకి ఆ ‘లీడ్’ అందించడం జరిగింది.

రాహుల్ గాంధీ ఇచ్చిన హింట్ ని జగన్మోహన్ రెడ్డి బాగానే క్యాచ్ చేసారు. కానీ అతనికి కాస్త దూకుడు ఎక్కువవడం చేత ఆ ‘ప్రత్యేక బ్రహాస్త్రాన్ని’ సరిగ్గా ప్రయోగించలేక మధ్యలోనే అస్త్ర సన్యాసం చేసారు. ఆ తరువాత మళ్ళీ ప్రత్యేక ఇంటర్వెల్ పడింది. ఇంటర్వెల్ తరువాత ప్రధాని నరేంద్ర మోడి ఇచ్చిన స్పూర్తితో రఘువీరా రెడ్డి ‘ప్రత్యేక మట్టి సత్యాగ్రహం’ టైటిల్ తో మళ్ళీ దానిని రీస్టార్ట్ చేసారు. కానీ దాని వలన కూడా ప్రత్యేక హోదా మంజూరు కాలేదు అలాగే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితిలో కూడా ఏ మాత్రం మార్పు కనబడలేదు పైగా ఇంకా ఖాళీ అయిపోయింది.

మళ్ళీ కొన్ని నెలలు ప్రత్యేక ఇంటర్వెల్ తీసుకొన్నాక తరువాత ఇవాళ్ళ మళ్ళీ దానిని రీస్టార్ట్ చేసారు. ప్రత్యేక హోదా కోసమో లేకపోతే డిల్లీలో ఉన్న తమ అధిష్టాన దేవతల మెప్పు పొందడానికో తెలియదు గానీ రఘువీరా రెడ్డి, శైలజానాథ్ మరో 300 మంది అనామక కాంగ్రెస్ కార్యకర్తలను వెంటబెట్టుకొని ‘ఛలో డిల్లీ’ అంటూ అందరూ విశాఖలో రైలెక్కేశారు. మూడు రోజులపాటు డిల్లీలో ఉండి రాష్ట్రపతి, ప్రధాని, లోక్ సభ స్పీకర్ వంటి ప్రభుత్వ పెద్దలను అందరినీ కలిసి ప్రత్యేక హోదా+ఇతర హామీల సంగతిని వారికి మరొక్కమారు గుర్తు చేసి వస్తామని రఘువీరుడు చెప్పారు. పనిలోపనిగా తమ అధిష్టాన దేవతలను కూడా కలిసి తమ ఈ ‘కష్టాన్ని’ వారి దృష్టిలో కూడా పడేస్తారుట.

ఇదంతా రాష్ట్రం బాగుకోరే చేస్తున్నదేనని వారు చెపుతున్నారు. అలాగ అనుకోవడం వలన రాష్ట్ర ప్రజలకు కొత్తగా వచ్చే నష్టమేమీ లేదు…పైగా చంద్రబాబు నాయుడు ఎలాగూ ఆ పని చేయ(లే)రు కనుక కొండకు వెంట్రుక ముడేసిలాగే తమ ఈ ప్రయత్నాలకి రాష్ట్ర ప్రజలు కూడా అభ్యంతరం చెప్పబోరని వారికీ తెలుసు కనుక ఛలో డిల్లీ అని అందరూ బయలుదేరిపోయారు.

తరువాత మళ్ళీ దీనికి ఎన్ని రోజులు ఇంటర్వెల్ పడుతుందో, కాంగ్రెస్, వైకాపాలలో మళ్ళీ ఏ పార్టీ ‘లీడ్’ తీసుకొంటుందో చూడాలి. ప్రత్యేక హోదా వలన రాష్ట్రానికి మేలు జరుగుతుందో లేదో అది వస్తే గానీ తెలియదు కానీ అది రాకపోతే ప్రతిపక్ష పార్టీలకి మేలు జరుగుతుందని స్పష్టం అవుతోంది. వాటికి నష్టం కలిగించే ఆ పని మోడీ ప్రభుత్వం ఎన్నడూ చేయదని అందరికీ తెలుసు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close