ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇద్దరు అభ్యర్థులను బరిలోకి దించాలని డిసైడయ్యారు. ఈ మేరకు ఫామ్ హౌస్లో జరిగిన సమావేశంలో తన అభిప్రాయాన్ని కేసీఆర్ చెప్పారు. అభ్యర్థులు ఎవరు అన్నది చివరి రోజు ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటి వరకూ బీఆర్ఎస్కు ఒక్క సీటు ఖాయమని అనుకుంటున్నారు. కానీ బలం లేకపోయినా కేసీఆర్ రెండో సీటుకు పోటీ పెట్టాలనుకోవడం ఆసక్తికరంగా మారింది.
తెలంగాణ అసెంబ్లీలో మొత్తం 119 స్థానాలున్నాయి. ఐదు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలకు నోటిఫికేషన్ వచ్చింది. ఇరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు ఉంటే ఒక ఎమ్మెల్సీ స్థానం వస్తుంది. బీఆర్ఎస్కు అధికారికంగా 38 మంది ఉండాలి. పది మంది కాంగ్రెస్ పార్టీలో చేరారు కనుక.. 28 మంది ఉంటారు. అధికారికంగా ఎంత మంది ఉన్నారన్నది లెక్కలోకి తీసుకుంటే.. మరో పది మంది బీఆర్ఎస్ అవసరం. అయితే ఎమ్మెల్యేలపై అనర్హత కోసం రెండో అభ్యర్థిని నిలబెట్టాలని కేసీఆర్ చూస్తున్నారని బీఆర్ఎస్ వర్గాలంటున్నాయి. విప్ జారీ చేస్తారని అంటున్నారు.
కానీ ఎమ్మెల్యేకోటా ఎమ్మెల్సీ ఎన్నికలు ఏకగ్రీవం కాకపోతే.. ఓటింగ్ జరిగితే.. సీక్రెట్స్ ఓటింగ్ జరుగుతుంది. ఎవరు ఎవరికి ఓటేశారో ఎవరికీ తెలియదు. కానీ పార్టీలు ఓ అంచనాకు రావొచ్చు. దానికి ఆధారం ఉండదు. ఈ ప్రకారం పార్టీ విప్ ను ఉల్లంఘించారని చెప్పడానికి అవకాశం ఉండదు. మరి కేసీఆర్ రెండో అభ్యర్థిని నిలబెట్టడం వల్ల ప్రయోజనం ఏముంటుంది?. కేసీఆర్ మైండ్ గేమ్ ఆడుతున్నారు కానీ.. రెండో అభ్యర్థిని పెట్టకపోవచ్చని బీఆర్ఎస్ క్యాడర్ భావిస్తోంది.