తెలంగాణ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలను పూర్తిగా మర్చిపోయినట్లుగా కనిపిస్తోంది. ముందు పంచాయతీల గడువు ముగిసింది. తర్వాత మున్సిపాలిటీల గడువు ముగిసింది. తర్వాత గ్రేటర్ హైదరాబాద్ పాలకవర్గం గడువు కూడా ముగిసింది. ఇప్పటికీ స్థానిక ఎన్నికలపై పెద్దగా ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించడం లేదు. గెలుపు ఉత్సాహం ఉన్నప్పుడే ఆరు నెలల్లోనే స్థానిక ఎన్నికలు పూర్తి చేయాలన్నంత హడావుడి పడ్డారు. కానీ రాను రాను చల్లబడ్డారు. ఇప్పుడు ఎన్నికలు నిర్వహిస్తారా లేదా అన్నది సస్పెన్స్ గా మారింది.
గెలుపు ఊపులో నిర్వహించాల్సిన ఎన్నికలు
కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత ఇతర పార్టీల లోకల్ క్యాడర్ అంతా వచ్చి పార్టీలో చేరారు. ఓ రకంగా పార్టీ బలోపేతం అయిందని అనుకోవచ్చు. సాధారణంగా గెలుపు ఊపులో ఎన్నికలు నిర్వహిస్తే.. గ్రామ స్థాయిలో పదవులన్నీ కాంగ్రెస్ ఖాతాలో పడిపోవడం సహజమే. కానీ ప్రాంతీయ పార్టీలో తీసుకున్నంత సులువుగా జాతీయ పార్టీల్లో నిర్ణయాలు తీసుకోలేరు. ఫలితంగా స్థానిక ఎన్నికల ప్రక్రియ ఓ అడుగు ముందుకు పదడుగుల వెనక్కి అంటూ సాగుతూ ఉంది. ఇప్పుడు అసలు మర్చిపోయారన్న సంకేతాలు కనిపిస్తున్నాయి.
అన్ని స్థాయిల్లో క్యాడర్కు పదవులు లోకల్ ఎన్నికలతోనే !
పార్టీ బలంగా ఉండాలంటే అన్ని స్థాయిల్లో క్యాడర్ కు పదవులు ఉండాలి. ఇలాంటి పదవులు కేవలం నామినేటెడ్ పోస్టుల వల్ల సాధ్యం కాదు. పూర్తి స్థాయిలో స్థానిక ఎన్నికలు నర్వహిస్తే ఎంపీటీసీ స్థాయి నుంచి గ్రేటర్ మేయర్ వరకూ పార్టీ నేతలకు ప్రజాస్వామ్య బద్దమైన..పవర్ ఉన్న పదవులు వస్తాయి. అప్పుడే వారిలో ఉత్సాహం ఉంటుంది. ఈ విషయాన్ని అంచనా వేసినా.. పార్టీ హైకమాండ్ ఏం ఆలోచిస్తుందో కానీ స్థానిక ఎన్నికలకు ఇప్పటి వరకూ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు.
రేవంత్ ఎందుకు ఆలస్యం చేస్తున్నారు ?
రేవంత్ రెడ్డి స్థానిక ఎన్నికలను సీరియస్ గా తీసుకుంటే గతంలో బీఆర్ఎస్ సాధించినట్లుగా కాంగ్రెస్ పార్టీకి ఏకపక్ష ఫలితాలు వస్తాయి. స్థానిక ఎన్నికల్లో అధికార పార్టీలు ఎలా గెలవాలో కేసీఆర్, జగన్ అధికారంలో ఉన్నప్పుడు చూపించారు. రేవంత్ దానికి రెండాకులు ఎక్కువే చదివే అవకాశం ఉంది. అయితే ఆయనకు స్వేచ్చ ఉందా లేదా అన్నదే సస్పెన్స్. లోకల్ బాడీ ఎన్నికలను ఎప్పటికప్పుడు నిర్వహించడం వల్ల ప్రజాస్వామ్యం కూడా బలంగా ఉంటుంది.