రాజకీయ నేతల తెలివితేటలన్నీ డబ్బుల చుట్టూ తిరిగితే మాజీ ఎమ్మెల్యే మద్దాళి గిరి వ్యవహారంలాగే ఉంటుంది. కరెంట్ బిల్లు కట్టాల్సి వస్తుందని ఆయన వైసీపీకి రాజీనామా చేశారు. అయినా సరే ఇప్పుడు కరెంట్ బిల్లు కట్టకపోతే ఆస్తుల్ని జప్తు చేస్తామని అధికారులు నోటీసులు ఇచ్చారు.
గుంటూరు పశ్చిమ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే మద్దాలి గిరి. ఆయన 2014లో తూర్పు నుంచి పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయారు. అయినా పార్టీ అధికారంలోకి రావడంతో అనధికార ఎమ్మెల్యేగానే చెలామణి అయ్యారు. 2019లో ఆయనకు సీటు లేదు. కానీ ఐదు సంవత్సరాలు యాక్టివ్ గా ఉన్నారని, సామాజిక సమీకరణాల కోణంలోనూ చూసి ఆయనకు గుంటూరు పశ్చిమలో సర్దుబాటు చేశారు. చాలా మంది నేతలు ఆ సీటు కోసం ప్రయత్నించినా ఆయనకు ఇచ్చారు. గెలిచారు. గెలిచిన తర్వాత వైసీపీలో చేరారు. చంద్రబాబు, టీడీపీపై అనుచిత వ్యాఖ్యలు చేశారు.
వైసీపీలో చేరి రాజకీయం ఆయన సాధించుకున్నది ఏమీ లేదు. చివరికి టిక్కెట్ కూడా ఇవ్వలేదు. ఆయనకు మిగిలిందేమిటంటే.. తన స్పిన్నింగ్ మిల్లులకు కరెంట్ బిల్లు కట్టకుండా తప్పించుకోవడం. రూ. 40 కోట్లకుపైగా కరెంట్ బిల్లు కట్టలేదు. వైసీపీ హయాంలో అడిగినా పట్టించుకోలేదు. అది తనకు మిగిలిందని అనుకున్నారు. కానీ ఎప్పటికైనా కట్టాల్సిందే అని గుర్తించలేకపోయారు. ప్రభుత్వం మారగానే ఆయన టీడీపీతో టచ్ లోకి వచ్చారు. గేటు దగ్గరకు కూడా రానివ్వకపోవడంతో వైసీపీకి రాజీనామా చేసి సైలెంటుగా ఉన్నారు. ఇలా అయినా కరెంట్ బిల్లు అడగరని అనుకున్నారు.
కానీ అధికారులు ఊరుకోలేదు. చట్టపరంగా చర్యలు తీసుకుంటున్నారు. కరెంట్ బిల్లు కట్టకపోతే ఆస్తులు జప్తు చేసేందుకు రెడీ అయ్యారు. నోటీసులు జారీ చేశారు. మద్దాలి గిరి వ్యవహారం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమయింది.