ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్… ఇలా మేటి స్టార్లని తన సినిమాలోకి తీసుకొచ్చి ‘కన్నప్ప’పై హైప్ పెంచాడు మంచు విష్ణు. ఈ సినిమా కోసం దాదాపు రూ.300 కోట్లు ఖర్చు పెట్టానని ఘనంగా ప్రకటించారు. అయితే ఈ సినిమాపై ఇప్పటి వరకూ ఎలాంటి బజ్ రాలేదు. ఇంతమంది స్టార్స్ ఉన్నా – జనం దృష్టి పడలేదు. ట్రైలర్ వస్తే లెక్కలు మారతాయి అని విష్ణు నమ్మకంతో ఉన్నాడు. ఇప్పుడు ఆ ట్రైలర్ బయటకు వచ్చింది. దాదాపు 3 నిమిషాల పాటు సాగిన సుదీర్ఘమైన ట్రైలర్ ఇది. ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్, మోహన్ బాబు.. ఇలా స్టార్లంతా తెరపై కనిపించారు. అందరి పాత్రలకూ సమ ప్రాధాన్యం ఉన్నట్టు అనిపించింది.
కన్నప్ప కథ అందరికీ తెలిసిందే. దేవుడంటే నమ్మకం లేనివాడు, పరమ శివ భక్తుడు ఎలా అయ్యాడన్నదే కన్నప్ప స్టోరీ. దాన్ని కొత్త సాంకేతిక హంగులతో, వార్ ఎపిసోడ్స్ తో ఆసక్తిగా మలిచే ప్రయత్నం చేశారు. విజువల్స్ కూల్ గా ఉన్నాయి. అయితే బాహుబలి టైపు వార్ ఎపిసోడ్స్ చూసిన వాళ్లకు ఈ విజువల్స్ ఏమాత్రం ఆనతాయి? అనేది పెద్ద ప్రశ్న.
కన్నప్ప ట్రైలర్ వస్తుందనగానే అందరి దృష్టీ.. ప్రభాస్ పై పడింది. ప్రభాస్ ఎంత సేపు కనిపిస్తాడు? ప్రభాస్ డైలాగులు ఎన్నుంటాయి? అని లెక్కలేసుకొన్నారు ఫ్యాన్స్. ప్రభాస్ ఫ్యాన్స్ కు ఈ ట్రైలర్ ఓకే అనిపిస్తుంది. రుద్రగా ప్రభాస్ పాత్రని పవర్ ఫుల్ గా ఊహించారు ఫ్యాన్స్. కానీ అది కనిపించలేదు. బహుశా.. సినిమా కోసం ఆ షాట్స్ అన్నీ దాచి పెట్టారేమో?
న్యూజీలాండ్ లో చిత్రీకరించిన సినిమా ఇది. సినిమా అంతా ఒకే చోట చుట్టేసిన ఫీలింగ్ కలుగుతోంది. ఇంతమంది స్టార్స్ ఉండగా విష్ణు బడ్జెట్ గురించి ఆలోచిస్తాడా?