ఇప్పుడు సినిమా పరిశ్రమలో ఆదాయ మార్గాలు గణనీయంగా మారిపోయాయి. శాటిలైట్ హక్కులు, ఓటిటి హక్కులు, మ్యూజిక్, డబ్బింగ్ లాంటి నాన్-థియేట్రికల్ బిజినెస్ సినిమాలకు కీలక ఆదాయంగా మారాయి. ఇవి ఒక సినిమాకు లాభదాయకతను నిర్ణయించడమే కాకుండా, హీరోల పారితోషికం, ఇమేజ్ పైనా ప్రభావం చూపుతున్నాయి.
తాజాగా నిర్మాత దిల్ రాజు చేసిన వ్యాఖ్యలు ఈ మారుతున్న ఈ పరిస్థితులకు అద్దంపట్టాయి. హీరో నితిన్ పారితోషికం తగ్గించాల్సి వచ్చిందని, దీనికి కారణం.. పడిపోయిన నాన్-థియేట్రికల్ బిజినెస్ అని ఎలాంటి దాపరికం లేకుండా క్లియర్ గా చెప్పారు.
ఈ పరిస్థితి నితిన్ కు సంబంధించినదే కాదు.. పరిశ్రమ మొత్తానికి ఒక హెచ్చరిక. నాన్-థియేట్రికల్ ఆదాయం సినిమాకు కీలకంగా మారిపోయింది. ముఖ్యంగా ఓటీటీ సినిమా బిజినెస్ లో ముఖ్య భూమిక పోషిస్తోంది. ఇప్పుడు కొన్ని సినిమాలకు దాదాపు ఆదాయం నాన్-థియేట్రికల్ నుంచే వస్తోంది.
ఈ పరిస్థితిలో నిర్మాతలు ఓ హీరో పారితోషికాన్ని అతని సినిమాల ఓటిటి, టీవీ, ఇతర భాషల్లో ఎంత డిమాండ్ ఉందో చూసి నిర్ణయిస్తున్నారు. ఒక హీరోకు థియేటర్లో ఓపెనింగ్ ఉంటే సరిపోదు. అతని సినిమాలు ఓటిటి వేదికలపై ఫంక్షన్ అవుతున్నాయా? టీవీలో ఆదరణ ఎలా వుంది? ఇలా అన్ని సమీకరణలు చుస్తున్నారు.
ఇంతవరకూ హీరోల ఇమేజ్ అంటే థియేటర్ హిట్లు, ఫ్యాన్ బేస్ ఆధారంగా తయారయ్యేది. కానీ ఇప్పుడు నాన్-థియేట్రికల్ మార్కెట్ లో హీరోకి ఉన్న విలువను బట్టి ఆయన బ్రాండ్ వాల్యూ నిర్ణయిస్తున్నారు. ఓటీటీ డేటా, టీవీ వ్యూయర్ రేటింగ్స్, వైరల్ కంటెంట్ ఇవన్నీ కలిసి ఓ హీరోను తయారు చేస్తున్నాయి.
ఈ పరిస్థితి హీరోలకు, దర్శకులకు ఒక వేకప్ కాల్. థియేటర్లో ఓపెనింగ్ మాత్రమే ఆశించి పారితోషికాలు అడగడం కాకుండా, మల్టీ-ప్లాట్ఫాం వ్యాల్యూ ని కాపాడుకుంటూ కెరీర్ నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లేలా ప్లాన్ చేసుకోవాల్సిన అవసరాన్ని ఇది చూచిస్తోంది. స్టార్ సిస్టమ్ ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ కంటే ఎక్కువగా డిజిటల్ స్క్రీన్ మీదనే తయారవుతోంది. దీన్ని చాలా లోతుగా అర్ధం చేసుకొని దానికి తగ్గట్టు సినిమాల కంటెంట్ ని ప్లాన్ చేసుకోవాలి.
దిల్ రాజు వ్యాఖ్యలు తెలుగు సినిమా మారుతున్న దిశని చూపిస్తున్నాయి. నాన్-థియేట్రికల్ ఆదాయ మార్గాలు ఇప్పుడు ప్రధానమైనవి. ఎవరు ఈ మార్పును అంగీకరిస్తారో వాళ్ళు కొత్త పంథాలో ముందుకెళ్తారు. మార్పుని అంగీకరీంచలేని వాళ్ళు మాత్రం పాత స్టార్ ఇమేజ్ పై బండి నెట్టుకు రావడం చాలా కష్టం.