మహాన్యూస్ చానల్పై బీఆర్ఎస్ కార్యకర్తల దాడిపై రాజకీయవర్గాల్లోనూ విస్మయం వ్యక్తమవుతోంది. ఫోన్ ట్యాపింగ్ లాంటి అంశం బయటకు వచ్చినప్పుడు , రాజకీయ నేతలు బహిరంగంగా విమర్శలు చేస్తున్నప్పుడు మీడియాలో సహజంగానే ఊహాగానాలు ప్రసారం అవుతూ ఉంటాయి. అలాంటి వాటిపై రెచ్చిపోయి దాడులు చేస్తే..ఇంకా ఎక్కువ ప్రచారం జరుగుతుంది కానీ.. తగ్గదు.
మహాన్యూస్ పై దాడి చేశారు. ఆర్థికంగా నష్టం కలిగి ఉండవచ్చు. కానీ మహా న్యూస్ ఇప్పుడు ప్రముఖమైన చానళ్లలో ఒకటిగా మారిపోతుంది. ఈ దాడి జరగనంత వరకూ ఆ చానల్ రీచ్ చాలా తక్కువ. శాటిలైట్ చానల్ కు తక్కువ.. యూట్యూబ్ చానల్ కు ఎక్కువ అన్నట్లుగా ఉండేది. యూట్యూబ్ వీడియో లు .. థర్డ్ గ్రేడ్ యూట్యూబ్ చానల్స్ తరహాలో థంబ్ నెయిల్స్ పెట్టుకుని వ్యూస్ తెచ్చుకుంటూ ఉంటారు. ఇప్పుడు దాడి చేయడం వల్ల.. అసలు కేటీఆర్ పై ఏం ప్రసారం చేశారన్నది ఆసక్తిగా చూస్తారు.
పోనీ ఇప్పుడు మహా న్యూస్ చానల్ భయపడుతుందా ? అంటే.. ఇదే ప్లస్ పాయింట్ గా మరింత దూకుడుగా వ్యతిరేక వార్తలు ప్రసారం చేస్తుంది. ఆ చానల్ కు పోయేదేమీై ఉండదు. న్యూస్ కవరేజీ కోసం కెమెరాలు బయటకు తీసుకెళ్తూంటే.. సామాన్లు సర్దుకుని వెళ్లిపోతున్నారని సంతృప్తి పడినంతనే అలా జరిగిపోదు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నా అలా చేయలేరు. తీన్మార్ మల్లన్న చానల్ పై ఎన్ని సార్లు దాడి చేశారు.. అయినా ఏమైనా చేయగలిగారా ?
ప్రజాస్వామ్యంలో దాడులు చేసిన వారికే నష్టం జరుగుతుంది. దాడులకు గురయిన వారికి ఎంతో మేలు జరుగుతుంది. ఆర్థిక నష్టం కూడా జరగదు. మహా న్యూస్ వంశీ.. జర్నలిస్టుగా ప్రారంభించి.. టీవీ చానల్ నడిపేలా ఎదిగారు. ఇలాంటి వాటిని ఎలా ఉపయోగించుకోవాలో ఆయనకు తెలిసినట్లుగా ఎవరికైనా తెలుస్తుందా?. ఈ మొత్తం వ్యవహారంలో అంతా కేటీఆర్ నే నిందిస్తారు. ఆయన హెచ్చరిస్తూ ట్వీట్ పెట్టిన కాసేపటికే దాడి చేశారు. దాడి చేసిన తర్వాత… భౌతిక దాడులు మంచివి కాదంటూ.. దాడి చేయడం మంచిదే అన్న అర్థంలో ట్వీట్ చేశారు.
ఎలా చూసినా మహా న్యూస్ పై బీఆర్ఎస్ దాడి .. కేటీఆర్ కు తెలియకుండా జరిగి ఉండదు.. ఇది ఎంత సెల్ఫ్ గోలో.. ముందు ముందు తెలిసే అవకాశం ఉంటుంది.