ఏడాది కాలంగా జాతీయ స్థాయిలో ఎన్నికల పరంగా కాంగ్రెస్ పార్టీకి పెద్దగా కలిసి రావడం లేదు. హిందీ గడ్డలో గట్టి సవాళ్లు ఎదురవుతున్న తరుణంలో, తెలంగాణలో జరిగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఆ పార్టీకి కొండంత అండగా నిలిచాయి. దాదాపు 1,500 కంటే ఎక్కువ వార్డుల్లో విజయం సాధించి, పట్టణ ఓటర్ల మద్దతును కూడా కూడగట్టడం రేవంత్ రెడ్డి నాయకత్వ పటిమకు నిదర్శనం.ఇదే విషయాన్ని ప్రముఖ జర్నలిస్టు రాజ్ దీప్ సర్దేశాయ్ చెప్పారు. ఇది కేవలం ఒక విజయం మాత్రమే కాదు, సంక్షోభంలో ఉన్న కాంగ్రెస్ కు దక్షిణాది నుంచి లభించిన అతిపెద్ద ఊరటగా ఆయన తేల్చారు.
రాహుల్-ప్రియాంకల నమ్మకమైన సేనాని
ఎన్నికల ఫలితాల అనంతరం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి ప్రియాంక గాంధీని కలిసి విజయ వివరాలను అందించారు. పార్టీ అధిష్ఠానం వద్ద రేవంత్ రెడ్డికి పెరుగుతున్న ప్రాధాన్యతను ఇది సూచిస్తోంది. ముఖ్యంగా యువతను, పట్టణ ఓటర్లను ఆకర్షించడంలో రేవంత్ అనుసరిస్తున్న వ్యూహాలు జాతీయ నాయకత్వాన్ని ఆకట్టుకుంటున్నాయి. కాంగ్రెస్ జనరేషన్ నెక్స్ట్ లీడర్లలో రేవంత్ రెడ్డి ఇప్పుడు అత్యంత వేగంగా ఎదుగుతున్న నాయకుడిగా ముద్ర వేసుకున్నారు.
పాలనతో పట్టు బిగించిన రేవంత్ వేవ్
గతంలో కాంగ్రెస్ అంటే కేవలం గ్రామీణ పార్టీ అనే ముద్ర ఉండేది. కానీ, తాజా మున్సిపల్ ఎన్నికల ఫలితాలతో పట్టణ ప్రాంతాల్లోనూ రేవంత్ వేవ్ కనిపిస్తోంది. రెండేళ్ల పాలనపై ఇది ఒక మినీ ప్రజా తీర్పు గా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రాజ్ దీప్ సర్దేశాయ్ అన్నట్లుగా, జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా ఒక శక్తివంతమైన, దూకుడున్న నాయకత్వాన్ని కాంగ్రెస్ వెతుకుతున్న తరుణంలో రేవంత్ రెడ్డి ఆ లోటును భర్తీ చేస్తున్నట్లు కనిపిస్తోంది.
జాతీయ రాజకీయాల్లో రేవంత్ ముద్ర
కేవలం తెలంగాణకే పరిమితం కాకుండా, పొరుగు రాష్ట్రాల ఎన్నికల్లోనూ రేవంత్ రెడ్డిని స్టార్ క్యాంపెయినర్గా వినియోగించుకోవడం చూస్తుంటే.. కాంగ్రెస్ ఆయనను ఒక జాతీయ ఆస్తిగా భావిస్తోంది. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు వరుస విజయాలను అందిస్తున్న ఏకైక నాయకుడిగా రేవంత్ రెడ్డి పేరు ఇప్పుడు ఢిల్లీ రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. రాబోయే రోజుల్లో ఏఐసీసీలో కీలక నిర్ణయాలు తీసుకోవడంలోనూ, దక్షిణాది రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేయడంలోనూ రేవంత్ పాత్ర అత్యంత కీలకం కానుందని ఎక్కువ మంది నమ్ముతున్నారు.
