తేదీలు ఖరారయ్యాయి. ఎజెండా సిద్ధమైంది. తొలిరోజు చర్చనీయాంశం ఏమిటో నిర్ణయం జరిగింది. ఇక చర్చలు వాద ప్రతివాదనలే తరువాయి. తెలంగాణ శాసనసభ శీతాకాల సమావేశాలు శుక్రవారం ప్రారంభమవుతున్నాయి. సమావేశాలకు ముందు రోజే బిజినెస్ అడ్వయిజరీ కమిటీ సమావేశం జరగడం ఈసారి ప్రత్యేకత.
ప్రస్తుతానికి ఈనెల 30 వరకూ సభా కార్యక్రమాల ఎజెండాను ఖరారు చేశారు. దీని ప్రకారం 12 పనిదినాల్లో సభ జరుగుతుంది. సమావేశాల తొలిరోజు, 16న పెద్ద నోట్ల రద్దు, పర్యవసానాలపై చర్చ జరుగుతుంది. ప్రస్తుతానికి మొత్తం 9 అంశాలపై చర్చ జరపాలని నిర్ణయించారు. ఈనెల 30 తర్వాత మరోసారి బీఏసీ సమావేశం జరుగుతుంది. జనవరిలో సమావేశాలను జరపడంపై అందులో నిర్ణయం తీసుకుంటారు.
మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, టీఎస్ ఐపాస్, ఇతర అంశాలపై చర్చిస్తారు. సమావేశాల కోసం అధికార ప్రతిపక్షాలు వ్యూహాలను సిద్ధం చేసుకున్నాయి. ఈసారి తెరాస పకడ్బందీ కార్యాచరణ ప్రణాళికతో సిద్ధం కావడం విశేషం. పెద్ద నోట్ల రద్దును సమర్థించిన తెరాసను తీవ్రంగా ఇరుకున పెట్టాలని కాంగ్రెస్ భావిస్తోంది. అలాగే వివిధ అంశాలపై కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ చేయబోయే విమర్శలను ముందుగానే ఊహించి, తిప్పికొట్టడానికి నోట్స్ సిద్ధం చేసుకోవాలని కేసీఆర్ తన పార్టీ వారికి సూచించారు. ప్రతిపక్షాలకు ఎట్టి పరిస్థితుల్లో అవకాశం ఇవ్వకుండా చూడాలనేది ఆయన ఉద్దేశమని పార్టీ వర్గాలు తెలిపాయి.