భిన్నమైన పార్టీగా చెప్పుకునే ఆమ్ ఆద్మీ పార్టీ ఒక విషయంలో అలాగే కనిపిస్తోంది. ఢిల్లీలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు వరసబెట్టి అరెస్టవుతున్నారు. నకిలీ సర్గిఫికెట్ల నుంచి లైంగిక వేధింపుల దాకా, గృహహింస నుంచి దౌర్జన్యం దాకా వివిధ నేరారోపణలపై కటకటాలు లెక్కిస్తున్నారు. తాజాగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే సోమనాథ్ భారతి రెండోసారి అరెస్టయ్యారు.
ఢిల్లీలోని ఆలిండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో ఈనెల 6న సోమనాథ్ భారతి దౌర్జన్యం చేశారని కేసు నమోదైంది. సెక్యూరిటీ గార్డులతో అనుచితంగా ప్రవర్తించారని, తన వెంట వచ్చిన అనుచరుల చేత విధ్వంసం చేయించారని ఆయనపై అభియోగం. ఈ కేసులో ఆయన్ని గురువారం నాడు పోలీసుల అరెస్ట్ చేశారు. గత ఏడాది ఆయన మరో కేసులో అరెస్టయ్యారు. ఆయన భార్య గృహహింస చట్టం కింద ఫిర్యాదు చేశారు. ఈ కేసులో ఆయన కొన్ని రోజులు పరారీలో ఉన్నారు. చివరకు చట్టానికి లొంగిపోవాలని కోర్టు హెచ్చరించడంతో సరెండర్ అయ్యారు. ఆ తర్వాత బెయిల్ పొందారు.
సోమనాథ్ భారతీతో కలిపి ఇప్పటి వరకూ 12 మంది ఆప్ ఎమ్మెల్యేలు అరెస్టయ్యారు. మొన్ననే అమానతుల్లా ఖాన్ అనే మరో ఎమ్మెల్యే అరెస్టయ్యారు. మహిళ పట్ల అనుచిత ప్రవర్తన కేసులో అరెస్టయిన ఆయన, గురువారం బెయిల్ పొందారు. న్యాయశాఖ మంత్రి హోదాలో జితేంద్ర సింగ్ తోమర్ గత ఏడాది జూన్ లో అరెస్టయ్యారు. నకిలీ లా సర్టిఫికెట్ పొందిన కేసులో ఆయన కారాగారానికి వెళ్లారు.
నరేష్ యాదవ్ జులై లో ఓ దౌర్జన్యం కేసులో అరెస్టయ్యారు. తర్వాత బెయిల్ పొందారు. దినేష్ మోహనియా, ప్రకాష్ జర్వాల్, శరద్ చౌహాన్, మనోజ్ కుమార్, సురిందర్ సింగ్, అఖిలేష్ త్రిపాఠి, మహేంద్ర యాదవ్, జగ్ దీప్ సింగ్ లు వివిధ ఆరోపణలపై అరెస్టయిన ఎమ్మెల్యేలు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కక్షగట్టి తమ పార్టీ వారిని అరెస్టు చేయిస్తారనేది ఆప్ అధినేత, సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆరోపణ. మోడీకి ఆప్ అంటే భయమని అందుకే తమవాళ్లను ఈ విధంగా కేసుల్లో ఇరికిస్తున్నారని ఆరోపణలు చేస్తున్నారు. అయితే, నకిలీ సర్టిఫికెట్ల కేసులో తోమర్ అరెస్టయినప్పుడూ ఇలాగే కేజ్రీవాల్ వాదించారు. తర్వాత మాత్రం తన తప్పు ఒప్పుకున్నారు. తోమర్ ను నమ్మి తప్పు చేశానని అసెంబ్లీలోనే ప్రకటించారు. మొత్తానికి, అరదండాలు పడిన ఆప్ ఎమ్మెల్యేల సంఖ్య పెరుగుతూనే ఉంది.