నవజ్యోత్ సింగ్ సిద్దూ భాజపాకి గుడ్ బై ఎందుకు చెప్పారు? అంటే ఆమాద్మీ పార్టీలో చేరడానికని జవాబు వినిపించింది. భాజపాలో లేనిది ఆమాద్మీ దగ్గర ఏముంది? అని ప్రశ్నిస్తే ‘ముఖ్యమంత్రి పదవి’ అని జవాబు వినిపించింది. పంజాబ్ ఎన్నికలలో తమ పార్టీ తరపున ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటిస్తానని అరవింద్ కేజ్రీవాల్ హామీ ఇచ్చినందునే ఆయన భాజపాని, తన ఎంపి పదవిని కూడా తృణప్రాయంగా వదులుకొని బయటకి వచ్చేశాడని మీడియాలో టాక్ వినిపించింది. కానీ అరవింద్ కేజ్రీవాల్ సిద్దూకి హ్యాండ్ ఇచ్చేయడంతో ‘ఆవాజ్ ఏ పంజాబ్’ అనే స్వంత కుంపటి పెట్టేసుకొన్నాడు. ఆ కొత్త కుంపటిని చూసి ముచ్చటపడి పంజాబ్ లో ఆమాద్మీ పార్టీ నేతలు చాలా మంది దాని చుట్టూ చేరిపోయారు.
వెంటనే ఆ రెండు పార్టీల మధ్య యుద్ధం మొదలైపోయింది. కొత్తగా పెట్టుకొన్న ఆ పార్టీ ప్రజల నోళ్ళలో బాగా నానితే గానీ ఇతర పార్టీల నేతలు కూడా దానిని గుర్తించరు. పార్టీలో చేరరు. కనుక ఆమాద్మీ పార్టీతో వేసుకొంటే ఫ్రీ పబ్లిసిటీ అవుతుందని సిద్దూ ఆ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ పై విమర్శలు గుప్పించడం మొదలుపెట్టారు.
ఆయన నిన్న తన పార్టీని ప్రారంభిస్తున్న సందర్భంగా సిద్దూ మీడియాతో మాట్లాడుతూ, “అరవింద్ కేజ్రీవాల్ తో నా సమావేశం గురించి అయన సగం మాత్రమే చెప్పారు. మిగిలింది నేను చెపుతాను. కొన్ని రోజుల క్రితం నేను ఆయనని కలిసినప్పుడు ఆయన నాకు ఏమి సలహా ఇచ్చారంటే, నా భార్యని మాత్రమే ఎన్నికలలో పోటీ చేయమన్నారు. నేను మరో మాట మాట్లాడకుండా ఆయనకి గుడ్ బై చెప్పేసి బయటకి వచ్చేశాను. అరవింద్ కేజ్రీవాల్ కి ఎప్పుడూ తాను ఏమి చెపితే దానికి ‘ఏసిబి’ అనే వాళ్ళు మాత్రమే నచ్చుతారు. నేను అలాంటి వాడిని కాను కనుక వచ్చేశాను,” అని అన్నారు.
సిద్దూ విమర్శలకి పంజాబ్ ఆమాద్మీ పార్టీ జర్నయిల్ సింగ్ స్పందిస్తూ,“పంజాబ్ లో గత పదేళ్లుగా భాజపా-అకాలీ దళ్ పార్టీ కూటమే అధికారంలో ఉంది. పదేళ్ళ పాలనలో అవి రాష్ట్రాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించేయడంతో ప్రజలు ఆ రెండు పార్టీలపై చాలా అసంతృప్తిగా ఉన్నారు. వాటిని రక్షించడానికే ఆర్.ఎస్.ఎస్-బి టీమ్ గా నవజ్యోత్ సింగ్ సిద్దూ ఈ కొత్త పార్టీని ఏర్పాటు చేశాడు,” అని విమర్శించారు.
ఇది ఎవరూ ఊహించని కొత్త కోణమేనని చెప్పవచ్చు. బహుశః అందుకే భాజపా నేతలు ఎవరూ నవజ్యోత్ సింగ్ సిద్దూ పార్టీ వీడిపోయినా ఇంతవరకు గట్టిగా విమర్శించడం లేదేమో?